ఈ గెలుపు రెడ్డిదా.. జ‌గ‌న్‌దా? భారీ స‌క్సెస్ బ్రో!

రాజ‌కీయాల‌లో చోటు చేసుకుని కొన్ని కొన్ని ప‌రిణామాల‌కు.. మ‌రికొన్నింటితో కార్యాకార‌ణ సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో జ‌రిగిన ఒక ప‌రిణామం కూడా అలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే.. ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌ సంఘానికి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇదేమీ .. మామూలుగా అయితే జ‌ర‌గ‌లేదు. అంతేకాదు.. ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ నేత‌లు వెయ్యిక‌ళ్ల‌తో ప‌రిశీలించారు. ఏం జ‌రుగుతుంది? అని లెక్క‌లు కూడా వేసుకున్నారు.

అదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హాలో ఎదురు చూశారు. దీనికి కార‌ణం.. స‌చివాల‌య ఉద్యోగుల‌ సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి కేంద్రంగా చోటు చేసుకున్న అనేక రాజ‌కీయాలు. గ‌తంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు. వెంక‌ట్రామిరెడ్డి ఉద్యోగుల సంఘానికి నాయ‌కుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న నోరు విప్పితే.. సీఎం జ‌గ‌న్ పేరు అల‌వోక‌గా వ‌స్తుంది. సీఎం స‌ర్‌.. లేక‌పోతే.. అంటూ.. ఆయ‌న ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు.

ఒకానొక ద‌శ‌లో ఉద్యోగులు సీఎం పైనా ప్ర‌భుత్వంపైనా నిప్పులు చెరిగిన‌ప్పుడు కూడా వెంక‌ట్రామిరెడ్డి క‌ట్టు త‌ప్ప‌కుండా త‌న అభిమానం చూపించారు. దీంతో ఆయ‌న‌కు టీడీపీకి మ‌ధ్య కూడా ఒక‌ద‌శ‌లో యుద్ధ‌మే జ‌రిగింది. దీంతో ఆయ‌న‌ను ఉద్యోగ సంఘం నాయ‌కుడిగా కంటే.. కూడా వైసీపీ నాయ‌కుడిగానే ఎక్కువ‌గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘానికి జ‌రిగిన ఎన్నిక‌లో వెంక‌ట్రామిరెడ్డి ఓడిపోవాల‌ని.. టీడీపీ అనుకూల ఉద్యోగ సంఘాల నాయ‌కులు భావించారు.

ఎందుకంటే.. వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని.. ఉద్యోగులు ఈ ప్ర‌భుత్వం అంటే మండిప‌డుతున్నార‌ని.. సో.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న వెంక‌ట్రామిరెడ్డి వంటివారిని ఓడించ‌డంద్వారా సీఎం జ‌గ‌న్‌కు లెస్స‌న్ చెప్పాల‌ని అనుకున్నారు. నిజానికి ఇది జ‌రిగి ఉంటే.. ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో ప‌డి ఉండేది. కానీ, అనూహ్యంగా వెంక‌ట్రామిరెడ్డి భారీ విజ‌యం న‌మోదు చేశారు. ప్యాన‌ల్‌లోని 1,225 ఓట్ల‌కుగాను 1,162 ఓట్లు పోల‌య్యాయి.

అంతేకాదు.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి రామ‌కృష్ణ‌పై 288 ఓట్ల మెజార్టీతో వెంక‌ట్రామిరెడ్డి ఘ‌న విజ‌యం సాధించ‌డం విశేషం. అలాగే వెంక‌ట్రామిరెడ్డి ప్యానల్ 9 పోస్టుల్లో ఆరింటిని ద‌క్కించుకుని స‌త్తా చాటింది. ఈ ప‌రిణామాల‌తో ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిర‌క‌త ఉందో లేదో స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్న‌ది వైసీపీ మాట‌. ఇక‌, టీడీపీ నేత‌లు మాత్రం ప్ర‌స్తుతానికి ఈ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌న్న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సో.. మొత్తానికి ఈ విజ‌యం వెంక‌ట్రామిరెడ్డి కంటే.. జ‌గ‌న్‌కే ఎక్కువ‌గా ఖుషీ నింపింద‌నేది వాస్త‌వం.