ఖమ్మం సభ.. చంద్రబాబు మోదీకి పంపిన సిగ్నల్

తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్నది బీజేపీ లక్ష్యం.. అయితే, తమ సొంత బలం ఒక్కటే అప్పుడే సరిపోదన్న సత్యమూ ఆ పార్టీకి తెలుసు. కానీ, బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేలా బీజేపీ బలాన్ని రెట్టింపు చేయగలిగే పార్టీ అక్కడ ఇంతవరకు ఇంకేదీ లేదు. ఆ క్రమంలోనే కొందరు బీజేపీ తెలంగాణ నేతలు టీడీపీని మళ్లీ యాక్టివేట్ చేసి పొత్తు పెట్టుకోవాలని సూచించినా అదే తెలంగాణ బీజేపీలోని ఇంకొందరు దానికి అడ్డుపడుతుండడంతో దిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఇంకా ఏమీ తేల్చని పరిస్థితి.

తెలంగాణ బీజేపీలో జగన్ అనుకూల వర్గం చంద్రబాబు బలాన్ని మోదీ, అమిత్ షాల వద్ద తక్కువ చేసి చూపుతుండడంతో రెండు పార్టీల జోడీ దిశగా అడుగులు పడలేదు. కానీ.. తాజాగా ఖమ్మంలో చంద్రబాబు నిర్వహించిన సభ ఒక్కసారిగా అందరి దృష్టీ టీడీపీపై పడేలా చేసింది.

8 ఏళ్ల తరువాత తెలంగాణలో చంద్రబాబు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. వెయ్యి కార్లతో చంద్రబాబు వెళ్తుంటే తెలంగాణ మొత్తం చూసింది. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తే పార్టీ అయోమయంతో చూశాయి.. చంద్రబాబుకు ఇంకా ఈ రేంజ్‌లో ఆదరణ ఉందా అని షాకయ్యాయి. విషయం దిల్లీలోని బీజేపీ అధిష్టానం వరకు వెళ్లింది. ఒక్క తెలంగాణకే కాదు ఏపీలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసేలా బీజేపీ అధిష్ఠానం బుర్రలో కదలిక వచ్చినట్లుగా ఆ పార్టీవర్గాలు చెప్తున్నాయి.

మరోవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబంలోనే కుంభకోణాలు, తగ్గుతున్న ప్రజాబలంతో బీఆర్ఎస్ ఒకప్పటిలా బాహుబలి ఆకారంలో లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటలను దాటి ఎన్నికలపై ఫోకస్ పెట్టే పరిస్థితే లేదు. ఈ పరిస్థితులలో బీజేపీ బలం పుంజుకుంది. కానీ, ఆ బలం ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సంపాదించడానికి ఏమాత్రం చాలదు. కేంద్రంలో… అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బంగారు పళ్లెంలాంటి బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో గోడ చేర్పు కావాలి. ఖమ్మంలో చంద్రబాబు సభతో టీడీపీ ఆ పార్టీకి బలమైన గోడలా కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయాలకు టీడీపీ దూరమైన తరువాత మళ్లీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే రోజు వస్తుందని చాలామంది ఊహించలేదు. కానీ, చంద్రబాబు తాజా సభ తరువాత సీను మొత్తం మారిపోయింది. ఇక రాజకీయం స్పీడు పెరగనుందని అర్థమవుతోంది. బంతి బీజేపీ కోర్టులో పడింది… ఆడాలో ఓడాలో నిర్ణయించుకోవడమే తరువాయి.