వంద రోజులు పూర్తి .. మ‌రి ఇమేజ్ పెరిగిందా?

Rahul Gandhi
Rahul Gandhi

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ, రాహుల్ గాంధీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన భారత్‌ జోడో యాత్ర 100 రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాల్లో సాగింది. దాదాపు 2,800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ కు అద‌నంగా ల‌భించిన ఫ‌లితం ఏంటి? రాహుల్‌కు ద‌క్కిన ఇమేజ్ ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిలోమీటర్ల దూరం సాగేలా ప్లాన్ చేసుకుని సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పూర్తి చేసుకుంది. మ‌ధ్య మ‌ధ్య చిన్నపాటి విరామ చిహ్నాలే త‌ప్ప‌.. మొత్తంగా చూస్తే..ఏక‌ధాటిగా ఇప్పటివరకు 2800కిలో మీటర్లు ఈ యాత్ర సాగింది.

అయితే, ఈ యాత్ర‌ ద్వారా రాహుల్‌ తన మద్దతుదారులతోపాటు వ్యతిరేకులను కూడా ఆకట్టుకున్నారనే ది కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. మ‌రోవైపు ఈ యాత్రలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారని కూడా అంటున్నారు. అయితే.. లెక్క ఎంత ఎక్కువ‌గా ఉంద‌నేది ప‌క్క‌న పెడితే.. ఇత‌మిత్థంగా ఈ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ సాధించింది ఏంటి? అనేది చూస్తే.. ఒకింత ఇబ్బంది త‌ప్ప‌దు.

ఎందుకంటే.. కీల‌క‌మైన గుజ‌రాత్ ఎన్నిక‌లు స‌హా ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఈ యాత్ర జరుగుతున్న స‌మ‌యంలోనే జ‌రిగాయి. అయితే, వీటిలో ఒక్క హిమాచ‌ల్ మిన‌హా మిగిలిన చోట కాంగ్రెస్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. హిమాచ‌ల్ గెలుపు కూడా సంప్ర‌దాయంగా అందిన విజ‌య‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. పోనీ భారీ గెలుపు అందామా? అంటే.. బొటా బొటీ స్థానాలే ద‌క్కాయి.

ఇక‌, గుజ‌రాత్‌లో అయితే.. 77 సీట్ల నుంచి 20కి జారిపోయిన ప‌రిస్థితి, ఢిల్లీ కార్పొరేష‌న్‌లో మ‌రింత దారుణం.. అంటే.. భార‌త్ జోడో యాత్ర ద్వారా కొల్ల‌గొట్టిన ఓట్లు పెద్ద‌గా లేవ‌నే చెప్పాలి. అయిన‌ప్పటికీ.. దీనిని కాంగ్రెస్ నాయ‌కులు విజ‌య‌యాత్ర‌గానే భావిస్తున్నారు. నిజానికి ఒక యాత్ర ల‌క్ష్యం.. ఎన్నిక‌ల్లో విజ‌య‌మే. దీనిని కాద‌ని.. ఎవ‌రూ అన‌లేరు. అలా చూసుకుంటే జోడో యాత్ర మొత్తం స‌ఫ‌ల‌మా? విఫ‌ల‌మా? అంటే.. ఇప్ప‌టికైతే.. సాగుతోంద‌నే చెప్పాలి.