బీఆర్ఎస్ కార్యకర్తల జేబులు మాత్రం ఖాళీ అయిపోయాయి

కేసీఆర్ జాతీయ పార్టీ కలలేమో కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటామోటా నాయకులకు మాత్రం ఆదిలోనే జేబులు బాగా ఖాళీ అయ్యాయి. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఎగురుకుంటూ వచ్చిన కార్యకర్తలు, చోటామోటా నాయకులు తిరుగు ప్రయాణంలో బుక్కయ్యారు. పార్టీ ఆఫీసు ప్రారంభం తరువాత గురువారం, శుక్రవారం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కావాలనుకుని విమానం టిక్కెట్లు చెక్ చేస్తే వారకి గుండె గుబేల్‌మంది. నాన్ స్టాప్ ఫ్లైట్ చార్జీలు రూ. 25 వేల నుంచి రూ. 27 వేలకు ఉండడంతో షాక్ తిన్నారు.

వన్ స్టాప్ ఫ్లయిట్లలో పోదామనుకున్నా అవి కూడా రూ. 17 వేలకు పైగానే ధర ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కంగు తిన్నారు. శనివారం నాటికి టికెట్ల ధరలు కాస్త తగ్గి నాన్ స్టాప్ అయితే రూ. 13 వేలు… వన్ స్టాప్ అయితే రూ. 11 వేలకు చిల్లర ఉన్నాయి. అయితే, దిల్లీలో రెండు మూడు రోజులు స్టే చేయాలన్నా సామాన్య కార్యకర్తలకు భారమే అవుతోంది. చలి తీవ్రంగా ఉండడం… ఫ్లయిట్ టికెట్ల ధరలు భారీగా పెరిగిన సంగతి హోటళ్ల నిర్వాహకులకూ తెలియడంతో హోటళ్ల ధరలూ భారీగా పెంచారు. ఓయో, మేక్ మై ట్రిప్ వంటివాటిలో సాధారణ పరిస్థితుల్లో రూ. 2 వేల నుంచి రూ. 4 వేలు చూపించే హోటళ్లు కూడా రూ. 5 వేల నుంచి రూ. 8 వేల ధరలు చూపిస్తున్నాయి.

ఇదేమీ కాదు ట్రైన్లో వెళ్దామంటే అప్పటికప్పుడు రిజర్వేషన్లు దొరకవాయె. ఎంపీలను పట్టుకుని ఎమర్జెన్సీ కోటా లేఖలు తీసుకెళ్లాలన్నా అవి కూడా పరిమిత సంఖ్యలోనే వర్కవుట్ అవుతాయి. దీంతో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభానికి వచ్చిన కార్యకర్తలు బడ్జెట్ అంచనాలు తప్పి గూగుల్ పే, ఫోన్ పే చేయమంటూ తెలంగాణలోని తమ వారికి కాల్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఎలాగూ వచ్చాం.. టికెట్లకు ఇంత ధర పెట్టేకంటే సమీపంలోని ఏవైనా టూరిస్ట్ ప్లేసెస్ చూసొద్దామంటూ ఇతర ప్రాంతాలకు పయనమవుతున్నారు. మొత్తానికి కేసీఆర్ జాతీయ కలలతో ఇప్పుడే ఇలా ఉంటే రానురాను తమ పరిస్థితి ఏమిటో అంటున్నారు కార్యకర్తలు.