ఇది కేసీఆర్ మాయ.. జగన్నాటకమా?

విభజన జరిగి ఎనిమిదిన్నరేళ్లు కావొస్తోంది. ఉమ్మడిగా ఎన్ని ఏళ్లు ఉన్నప్పటికీ ఒకసారి విడిపోవాల్సి వస్తే.. లెక్కలు ఆటోమేటిక్ గా తెర మీదకు వస్తాయి. అది భార్యభర్తల బంధంలో కావొచ్చు. రాష్ట్రాల విషయంలో కావొచ్చు. సాధారణంగా విడిపోవటం అన్న ప్రక్రియ మొదలైనంతనే.. ఆస్తులు.. అప్పుల లెక్కలు రావటం.. ఎవరికేమిటి? అన్న పంచాయితీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఏపీ ప్రజలు విడిపోయే ప్రసక్తే లేదన్న మాట మీద ఉండటం.. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదన్న నమ్మకంతో కొంతకాలం ఉండగా.. ఆ తర్వాత వారి సెంటిమెంట్ వారికే శాపంగా మారిన దుస్థితి.

అప్పటివరకు కలిసి ఉందామని నినాదాలు ఇచ్చినోళ్లు.. విడిపోయే వేళ.. లెక్కలు చేసుకోండని ఎవరైనా అంటే.. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతామన్నది మరో వాదన. దీనికి కారణం లేకపోలేదు. విడిపోవాలన్న ఆకాంక్ష ఏపీ ప్రజల్లో ఇసుమంత కూడా లేకపోవటం.. అలాంటి వేళలో.. రాష్ట్ర ప్రయోజనాల గురించి.. ఆస్తుల లెక్క గురించి మాట్లాడితే తమ రాజకీయ భవితకు దెబ్బ పడుతుందన్న భయంతో నోరు మూసేసుకొని ఉండిపోయారు. అలా ఆస్తుల పంచాయితీ గురించి ఎవరూ ఏమీ మాట్లాడకుండానే.. పెద్ద చర్చలు జరగకుండానే.. లాభనష్టాల బేరీజు వేసుకోకుండానే విభజన జరిగిపోయింది.

దాదాపు ఎనిమిదేళ్లకు పైనే జరిగిపోయాక.. హటాత్తుగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లుగా ఏపీలోని జగన్ సర్కారు ఒక్కసారిగా అలెర్టు అయ్యింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. తన పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచన చేయటం తెలిసిందే. అందుకు తగ్గట్లే బుధవారం ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించారు. రాష్ట్రాల వారీగా అడుగులు వేసే వేళ.. తొలి అడుగు ఏపీలో వేయాలని గులాబీ బాస్ డిసైడ్ కావటమే కాదు.. అందుకు తగ్గట్లే విజయవాడలో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు వచ్చారు.

ఇలా జరుగుతున్న వేళ సజ్జల నోటి నుంచి మళ్లీ కలిసిపోవటానికి మా ఓటు అని చెప్పటం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ తెర మీదకు రావటం.. ఆ వ్యాఖ్యల కారణంగా ఏపీ అధికార పక్షానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆస్తుల లెక్కలు తేల్చాలంటూ సుప్రీంను ఆశ్రయించటం ఇప్పుడు సరికొత్త చర్చకు తెర తీసింది. ఎవరైనా ఎవరికైనా బాకీ ఉన్నప్పుడు.. సొమ్ములు రావాల్సిన వ్యక్తి సొమ్ములు ఇవ్వాల్సిన వారిని అడగటం.. పలు ప్రయత్నాలు చేసి.. చివరకు కోర్టును ఆశ్రయిస్తారు.

తాజా ఎపిసోడ్ చూస్తే.. ఏకాఏకిన సుప్రీంకోర్టుకు జగన్ సర్కారుకు వెళ్లటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన ఆస్తుల గురించి మాట్లాడింది లేదు. చర్చలు జరిపింది లేదు. చివరకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి.. తనకు సన్నిహితుడైన కేసీఆర్ తో చర్చలు జరిపింది లేదు. అలా ఏమీ చేయకుండా ఇప్పుడు ఒక్కసారిగా సుప్రీంను ఆశ్రయించటం వెనుక కేసీఆర్ మేజిక్ ఉందా? జగన్నాటకమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తాజా వ్యాజ్యం కారణంగా తెలంగాణలో సెంటిమెంట్ రగలటం ఖాయం. అదే జరిగితే.. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు ముంచుకొచ్చే వేళలో.. తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడే పార్టీగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నిలుస్తుంది. ఇదంతా కేసీఆర్ కు మేలు చేకూర్చేందుకే జగన్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఆస్తుల గురించి ఇంతకాలం మాట్లాడని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా ఆ అంశానికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం చూస్తే.. ఈ ఇష్యూలో కంటికి కనిపించని ఏదో రాజకీయం కదులుతుందన్న భావన కలుగక మానదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.