ఏపీకో దండం… ఇక మేం పోతాం…

విశాఖను ఎగ్జిక్యుటివ్ కేపిటల్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. త్వరలో పాలనను సాగర నగరం నుంచి ప్రారంభిస్తానని చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ నగరాన్ని అందమైన నందనవనంగా మార్చే ప్రయత్నం ఒక వంతయితే.. అన్ని రకాల వసతులు, కార్యాలయాలు, విద్యా సంస్థలు పెంచడం మరో వంతు అని వైసీపీ వర్గాలు బాకా ఊదుకుంటున్నాయి.

వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని తాజా పరిస్థితులు చెబుతూనే ఉన్నాయి. ఎంత దాచినా దాగని వాస్తవాలు చాలానే ఉన్నాయి. అందులో పెట్రోలియం యూనివర్సిటీ తరలిపొంతుందన్న వార్త ప్రధానమైనదిగా చెప్పొచ్చు..

2015లో విద్యా సంస్థ ఏర్పాటు

విభజన హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్టీని ఏపీకి కేటాయించారు. 2015లో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోదాన్ని విశాఖపట్నానికి కేటాయించారు.

అయితే ఈ సంస్థ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో సుమారు 201.8 ఎకరాల సేకరణకు సిద్ధమైంది. కొంత భూమిని సేకరించి 2016లోనే భూమి పూజ కూడా నిర్వహించింది. అయితే, శాశ్వత క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు తరగతులను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన భవనంలో నిర్వహిస్తున్నారు.

బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 సీట్లు ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఇందులో సీట్లు కేటాయిస్తారు. ఇక్కడ నుండి ఇప్పటికే రెండు బ్యాచ్ లు కూడ బయటకు వెళ్లీపోయాయి.

ఈ పెట్రో వర్సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,055 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.400 కోట్లు కాలేజీ నిర్వహణ కోసం కేటాయించింది. ఈ మొత్తానికి సంబంధించి వచ్చే వడ్డీతో సంస్థను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.655 కోట్లతో నిధులతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం మొదటి దశగా రూ.150 కోట్లు విడుదలై సిద్ధంగా ఉన్నాయి. వంగలిలో సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసీకి ఇచ్చింది. కానీ, నిర్మా ణం సగమే పూర్తయింది. అయితే భూ సమస్య కారణంగా ఇది వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడడం ఆందోళన రేపుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం సేకరించదలచిన 201.8 ఎకరాల్లో 145 ఎకరాలకు రైతుల నుంచి ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. పట్టా ఉన్న రైతులకు ఎకరాకు రూ.15 లక్షలు, పట్టాలేని రైతులకు రూ.7 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం 145 ఎకరాలు సేకరించింది. మరో 15 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోని పోరంబోకు కావడంతో మొత్తం 160 ఎకరాల సేకరణ ప్రక్రియ సజావుగానే సాగింది. అయితే, మరో 20 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తానన్న నష్ట పరిహారం తీసుకునేందుకు రైతులు సుముఖంగానే ఉన్నప్పటికీ… కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై గొడవలు రావడంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు.

ఈ ఏడాది ఆగస్టులో కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఎకరాకు రూ.13 లక్షలు లెక్కగట్టి, పట్టా ఉన్నట్టయితే రెండున్నర రెట్లు అంటే రూ.32.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద మరో రూ.5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతోపాటు చెట్లు, మోటార్‌ పంపులకు చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం హైకోర్టు రిజిస్ర్టార్‌కు రూ.6.39 కోట్లు డిపాజిట్‌ చేసింది.

అయితే, పట్టాదారులతో సమానంగా తమకూ నష్టపరిహారం చెల్లించాలంటూ పట్టాలేని రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జితో కూడిన ధర్మాసనం పట్టాదారులకు ఇచ్చినట్టుగానే పట్టాలేని రైతులకూ ఇవ్వాలని, అందుకు అవసరమైన మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని సూచించింది. కోర్టు తుది తీర్పును అనుసరించి చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. అయితే, పట్టాలేని రైతులకు అంత మొత్తంలో చెల్లిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే చెల్లించాల్సి వస్తుందని, ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్‌లో ఉంది.

రాయ్‌బరేలికి తరలిస్తారా….!

భూముల వ్యవహారం తేలకపోగా.. మరింత జటిలమవుతున్న నేపథ్యంలో పెట్రో వర్సిటీ అధికారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొద్దిరోజుల కిందట లేఖ రాశారు. ప్రస్తుతం సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా మరోచోట కేటాయించాలని కోరారు. ఆ లేఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. పెట్రో వర్సిటీ మంజూరై ఏడేళ్లు కావస్తున్నా భూ వివాదాన్ని తేల్చకపోవడం పట్ల కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే వర్సిటీకి సంబంధించిన భూ వివాదాన్ని తేల్చకపోతే ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఉన్న యూనివర్సిటీలో విలీనం చేద్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది. యూనివర్సిటీ అధికారులకు ప్రాథమికంగా దీనిపై సమాచారం అందింది. ఈ సంగతి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. మరి వారితో చర్చించి కోర్టు కేసులు తేలే వరకు ఆగాలని కోరతారా… లేక అన్ని సంస్థలను వదిలేసినట్లే పెట్రో వర్సిటీకి మంగళం పాడతారా.. తెలియడం లేదు…