ఢిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీల‌ను తొల‌గించేశారు!

భార‌త రాష్ట్ర‌స‌మితి పేరుతో జాతీయ స్థాయిలో గ‌ళం వినిపించి.. ప్ర‌ధాని మోడీకి చుక్క‌లు చూపించాల‌ని అనుకున్న సీఎం కేసీఆర్‌.. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో బీఆర్ ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ప్రారంభించా రు. అత్యంత అట్ట‌హాసంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ప‌లువురు కీల‌క రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, మాజీ ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఢిల్లీలోని ప్ర‌ధాన మార్గాల్లో కేసీఆర్ చిత్రంతో కూడిన భారీ ఫ్లెక్సీల ను ఏర్పాటు చేశారు. వీటిపై.. దేశ నేత‌ రైతుల ఆశాజ్యోతి కేసీఆర్ జ‌య‌హో నినాదాల‌ను ఇంగ్లీషు, హిందీల్లో ముద్రించారు. వీటిని ఢిల్లీ విమానాశ్ర‌యం నుంచి నూత‌న భ‌వ‌నం వ‌ర‌కు.. ర‌హ‌దారికి రెండు వైపుల పెద్ద ఎత్తున క‌ట్టారు. అయితే.. వీటిని తెల్లారి చూసే స‌రికి క‌నిపించ‌క‌పోవ‌డం గమ‌నార్హం.

ముఖ్యంగా స‌ర్దార్ ప‌టేల్ మార్గంలో అయితే.. గులాబీ జెండాలు భారీ ఎత్తున వెలిశాయి. అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీల‌ను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు మాత్రం తెల్ల‌వారుజామునే వీటిని తొల‌గించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌.. సీఎం కేజ్రీవాల్ అధీనంలో ఉన్న రాష్ట్రంలో ఇలా జ‌ర‌గ‌డం.. చ‌ర్చ‌నీయాంశం అయింది.

అయితే.. స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో అనేక మంది వీవీఐలు తిరుగుతూ ఉంటార‌ని.. వారికి ఇబ్బంది క‌లిగించ కూడ‌ద‌నే ఏకైక ఉద్దేశంతోనే తాము ఫ్లెక్సీల‌ను తొల‌గించామ‌ని.. ఢిల్లీ కార్పొరేష‌న్ అధికారులు తెలిపారు. ఇక‌, దీనిపై బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.