క‌ట్టండ‌హో: చెత్త పన్ను అయిపోయింది.. ఇక‌, నీటి మీట‌ర్లు..!

ఏపీలో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌చారం దంచికొట్టిన వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. రాజన్న రాజ్యం స్థానంలో మోడీ రాజ్యం తీసుకువ‌చ్చార‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ స‌ర్కారు రాష్ట్రాల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. వెంట‌నే అమ‌లు చేసేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఏపీనే! నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మోడీ తీసుకున్న నిర్ణ‌యాలు అక్క‌డి ముఖ్య‌మంత్రులు చెత్త‌బుట్ట‌లో ప‌డేస్తున్నారు. ఎందుకంటే.. ప్ర‌జావ్య‌తిరేకత పెల్లుబుకుతుంద‌నే భ‌యంతోనే.

కానీ, ఏపీలో మాత్రం తాను చెప్పిందే వేదం.. చేసిందే పాల‌న అనుకుంటున్నారో ఏమో.. తెలియ‌దు కానీ, సీఎం జ‌గ‌న్‌ మాత్రం మోడీ క‌నుస‌న్న‌ల్లో.. ఆయ‌న ఆదేశాల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ మోడీ తాన అంటే..జ‌గ‌న్ తందానా అనేస్తున్నారు. కొన్నాళ్లు గా రాష్ట్రంలో చెత్త‌ప‌న్నును వ‌సూలు చేస్తున్నారు. ఎందుకంటే..”మీకు అప్పులు ఎక్కువ కావాలంటే..ప్ర‌జ‌ల నుంచి చెత్త‌ప‌న్ను వ‌సూలు చేయండి” అని మోడీ హుకుం జారీ చేయ‌డ‌మే. అయితే.. ఈ ఆదేశాలు అప్పుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు తిప్పికొట్టాయి.

కానీ, ఏపీలో మాత్రం చ‌క్క‌గా అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రైనా క‌ట్ట‌నంటే పింఛ‌న్ క‌ట్‌, క‌రెంట్ క‌ట్‌, అమ్మ ఒడి క‌ట్ అంటూ..క‌ట్ క‌ట్ చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. లాఠీలు కూడా ఝ‌ళిపిస్తున్నారు. అధికారుల‌తో సిబ్బందిని అమ్మ‌నాబూతులు తిట్టించైనా ప్ర‌జ‌ల‌నుంచి ప‌న్నులు వ‌సూలు చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు ఇదే ప‌రంప‌ర‌లో తాగునీటికి కూడా మీట‌ర్లు పెట్టేశారు. ఇది దేశంలోనే తొలి రాష్ట్రం. ఎప్ప‌టినుంచో నీటి మీట‌ర్లుపెట్టేవారికి అప్పులు చేసుకునేందుకు ఎక్కువ అవ‌కాశం ఇస్తామ‌ని మోడీ చెబుతున్నా.. ఆయ‌న పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా పెడ‌చెవిన పెట్టాయి.

కానీ, ఘ‌న‌త వ‌హించిన ఏపీలో మాత్రం 151 సీట్లున్న జ‌గ‌న్ ముందు వెనుక ఆలోచించుకుండా అప్పులు వ‌స్తే.. చాలు.. అంతక‌న్నా ఏముంది మేలు.. అని అనుకుంటూ.. ప్ర‌జ‌ల‌పై మీట‌ర్ల‌ను ఎగ‌దోశారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే..నీటి మీట‌ర్లు వ‌ద్ద‌న్న‌వారికి నీటి కుళాయిలే తీసేస్తార‌ట‌. సో.. రాజన్న రాజ్యం కాదు.. మోడీ రాజ్యం తెచ్చిన జ‌గ‌న్‌కు ఇక‌, క‌ట్టండి ప‌న్నులు! అంటున్నారు సామాజిక వేత్త‌లు.