పవన్ కంటే ముందు షర్మిలకు రూట్ మ్యాప్ ఇచ్చేసిందా ?

తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మెల్లమెల్లగా బీజేపీ చేతిలోకి వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు ఏపీలో బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం పనిచేస్తానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ ఆయనకు ఇంకా పూర్తిగా రూట్ మ్యాప్ అందినట్లుగా లేదు.

ఈలోగా తెలంగాణలో వైఎస్ షర్మిలకు బీజేపీ ఫుల్ రూట్ మ్యాప్ ఇచ్చినట్లుగా బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఆ క్రమంలోనే షర్మిల ఒక్కసారిగా దూకుడు పెంచి బీఆర్ఎస్ నేత కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తున్నారని చెబుతున్నారు.

పట్టు వదలకుండా పాదయాత్ర చేస్తుండడం… పాదయాత్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతుండడం వంటివన్నీ బీజేపీ అండదండలు పుష్కలంగా ఉండడంతోనే సాధ్యమవుతున్నాయని చెబుతున్నారు.

మొన్నటికి మొన్న ధ్వంసమైన కారులో ప్రగతి భవన్‌ ముట్టడికి బయల్దేరిన షర్మిల నిన్న తన పాదయాత్రకు అనుమతి దొరక్కపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులపై విరుచుకుపడిన తీరు కానీ… రోడ్డుపైనే 4 గంటల పాటు బైఠాయించిన తీరు చూసినవారు షర్మిలను ఇక తేలిగ్గా తీసుకోవడానికి లేదని విశ్లేషిస్తున్నారు.

షర్మిల ఆమరణ దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. లోటస్ పాండ్‌లోనే ఆమె దీక్ష చేస్తున్నారు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఆమె దీక్ష చేస్తుండగా పోలీసులు లోటస్ పాండ్‌ను పూర్తిగా దిగ్బంధించారు.

షర్మిల దూకుడుగా ఉన్న సమయంలో బీజేపీ నుంచి భారీ కార్యక్రమాలు లేకుండా చూసుకోవడం.. బీజేపీ నేతలు కూడా కేసీఆర్‌పై ఎదురుదాడి తగ్గిస్తూ షర్మిల ఫోకస్ అయ్యేలా చూడడం వంటివన్నీ బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం అంతా నడుస్తోందనడానికి సూచికగా కనిపిస్తోంది. 

ఏపీలో పవన్‌ను బీజేపీ తమ రూట్ మ్యాప్ ప్రకారం నడిపించిలని చూస్తున్నా ఆయన ఇంకా పూర్తిగా దాన్ని అమలు చేయలేకపోతున్నారని.. ఇంకా టీడీపీ కౌగిలిలో ఉన్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ కారణంగానే పవన్ కంటే ముందు షర్మిలను తెలంగాణలో ఫుల్ స్కేల్‌లో ఉపయోగించుకునేలా బీజేపీ నడిపిస్తోందని తెలుస్తోంది.