వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందా ?

సోషల్ మీడియాలో ఇప్పుడో కొత్త ప్రచారానికి తెరలేచింది. అందులో నిజం ఎంత ఉన్నా… నిప్పులేదని పొగరాదని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వారు ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలకు స్కెచ్ వేశారని ప్రచారం జరగడంలో వైసీపీ అగ్రనేతల్లో టెన్షన్ పట్టుకుంది.

తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్యేల పోచింగ్ జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురిని బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నించినట్లు అనుమానాలు వచ్చాయి. దానితో కేసీఆర్ తనదైన శైలిలో స్కెచ్ వేసి ఎమ్మెల్యేలను కాపాడుకున్నారు. ముగ్గురు మధ్యవర్తులను అరెస్టు చేయగా.. వారిపై సిట్ విచారణ జరుగుతోంది. ప్రస్తుతానికి ముగ్గురికి బెయిల్ వచ్చింది. మొత్తం వ్యవహారంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హస్తం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టింది.. ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కిరాలేదు..

ఇప్పుడు ఏపీలోనూ ఫిరాయింపుల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా లాగేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వైపు నుంచే జగన్ కు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. అంతర్గతంగా విచారణ మొదలుపెట్టారు. 150 మంది ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో ఉన్నారో, వారి కదలికలేమిటో తెలుసుకుంటున్నారు. అసలు బీజేపీ ప్లానేమిటో అర్థం కాని పరిస్థితుల్లో జగన్ స్వయంగా ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకుంటున్నారు. ఏక్ నాథ్ షిండే టైపులో ఎవరినో రెచ్చగొట్టి గ్రూపుగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీపై జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని పార్టీ సర్వేలు చెబుతున్నాయట. దానితో నియోజకవర్గంలో ప్రజలను ఆకట్టుకోలేకపోయిన వారికి టికెట్లు ఇచ్చే విషయంలో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. తమకు టికెట్లు దక్కకపోవచ్చని కొందరు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. అలాంటి వారినే ఆపరేషన్ ఆకర్ష్ కిందకు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది.. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాలను పరిశీలించడం ఒక వంతయితే, ఎన్నికల నాటికి వైసీపీపై వత్తిడి పెంచడం రెండో గేమ్ ప్లాన్ గా భావిస్తున్నారు. అందుకే ఐదుగురు ఎమ్మెల్యేలను లాగినా చాలని కమలనాథులు అనుకుంటున్నారట. ఎక్కువ మంది వస్తే మరీ మంచిదని చెబుతున్నారట..