సాయిరెడ్డి పేరు వినిపిస్తే కేసీఆర్ ఒంటి కాలి మీద లేస్తున్నారట..

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తే చాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహంతో ఇంతెత్తున ఎగిరిపడుతున్నారట. కొద్ది నెలలుగా తమ కుటుంబంపై అవినీతి మరకలు పడడానికి పరోక్షంగా విజయసాయిరెడ్డే కారణమని కేసీఆర్ భావిస్తుండడమే దానికి కారణమని చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్నందున తమ కుటుంబంపై గతంలోనూ ఆరోపణలు వచ్చినా ఎన్నడూ కూడా ఇలా అడ్డంగా దొరికిపోలేదని.. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అడ్డంగా బుక్కవడానికి విజయసాయిరెడ్డి, ఆయన మనుషులే కారణమని కేసీఆర్ గట్టిగా అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రంలోని బీజేపీతో దగ్గరగా ఉన్నందున విజయసాయిరెడ్డి ఉండగా చేసే వ్యవహారాలతో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని కవిత గుడ్డిగా నమ్మి కేసుల్లో ఇరుక్కోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా ఇరుకునపెట్టేసిందని కేసీఆర్ భావిస్తున్నారట.

బీజేపీతో కయ్యం పెట్టుకునే సమయానికి తమ జుత్తు వారికందేల కవిత అడ్డంగా బుక్కయ్యారని.. దీనికంతటికీ విజయసాయిరెడ్డే కారణమని కేసీఆర్ ఆగ్రహిస్తున్నారట.

మరోవైపు కవితతో పాటు విజయసాయిరెడ్డికీ సీబీఐ నోటీసులు అందాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ప్రస్తుతానికి విజయసాయిరెడ్డికి నోటీసులు ఇంకా ఇవ్వకపోయినా ఒకరిద్దరి విచారణల అనంతరం ఆయనకూ సీబీఐ విచారణకు నోటీసులు అందడం ఖాయమని చెబుతున్నారు.

విజయసాయిరెడ్డి కేంద్రంలోని బీజేపీతో తనకు ఉన్న సంబంధాలపై నమ్మకం పెట్టుకున్నా… బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని ఎంతగా టార్గెట్ చేస్తుందో… ఎక్కడ దొరుకుతుందా అని ఎంతగా ఎదురుచూస్తుందా అనేది అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని.. దాంతో ఆయన మొత్తం అందరినీ ఇరికించేశారని అనుకుంటున్నారట.

ఈడీ, సీబీఐ కేసులు కావడంతో అంతవేగం తేలవని… చాలాకాలం తమను వెంటాడుతాయని.. కవిత కారణంగా కేంద్రం దగ్గర తగ్గి ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నారట కేసీఆర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్‌లా తమ జుట్టు కూడా కేంద్రం చేతికి చిక్కితే రాజకీయంగా దెబ్బయిపోతామని భయపడుతున్నారట.