రోజా రెడ్డి బీసీ అట..

రాజకీయ నాయకులు ఏ వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొంటే ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు వస్త్రధారణో, అలంకరణో మార్చుకోవడం మామూలే. అంటే… రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందుకు వెళ్తే ముస్లిం టోపీ పెట్టుకోవడం.. యాదవులు, కురుమల సభలకు వెళ్తే గొంగళి కప్పుకోవడం, మత్స్యకారుల సభకు వెళ్తే భారీ చేప ఒకటి పట్టుకోవడం వంటివి చేస్తుంటారు.

అదంతా సింబాలిక్‌గా జరుగుతుంది. కానీ.. ఏపీ పొలిటీషియన్స్ మాత్రం ఏకంగా తమ కులాలనే మార్చేస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డి తాను రెడ్డి కాదు కాపు అని చెప్పారు… తాజాగా మరో వైసీపీ నేత, మంత్రి రోజా కూడా తాను రెడ్డి కాదు బీసీ అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

 విజయవాడలో వైసీపీ నిర్వహించనున్న బీసీ మహాసభకి సంబంధించిన పోస్టర్‌ను రోజా నగరిలోని తన క్యాంపు కార్యాలయంలో రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన భర్త సెల్వమణి బీసీ సామాజికవర్గానికి చెందినవారని, తాను బీసీ ఇంటి కోడలిని కాబట్టి తాను కూడా బీసీనే అని చెప్పారు.

బీసీలను టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఆమె విమర్శించారు. బీసీలను వెనుకబడినవారిగా కాకుండా… రాష్ట్రానికే వెన్నెముకగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. 139 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్‌దని అన్నారు.

ఇదంతా ఎలా ఉన్నా రాజకీయాల కోసం ఏకంగా కులం కూడా మార్చి చెప్పడం రోజాకే చెల్లిందని అంటున్నారు విమర్శకులు.