టాలీవుడ్ కి ఏపీ మంత్రి అల్టిమేటం !

ఆంధ్రప్రదేశ్‌లో అటు ఇటుగా ఒక ఏడాది వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి ‘రాజధాని’ ఎన్నికల అంశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు పలికి.. ఆ తర్వాత పూర్తిగా స్టాండ్ మార్చేసిన జగన్ అండ్ కో.. మూడు రాజధానుల పాట అందుకుని దాని చుట్టూ రాజకీయాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తోంది. 

అటు ఉత్తరాంధ్ర జనాలను.. ఇటు రాయలసీమ వాసులను ఈ విషయంలో రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారు. ఆల్రెడీ విశాఖలో ఒక గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు.. తాజాగా రాయలసీమలో ఒక గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జన సమీకరణ అతి కష్టం మీద జరగ్గా.. వచ్చిన జనాలు కూడా మధ్యలో వెళ్లిపోవడం గురించి చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో వైసీపీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కర్నూలులో హైకోర్టుకు మద్దతుగా టాలీవుడ్ హీరోలు గళం విప్పాలంటూ గుమ్మనూరు జయరాం డిమాండ్ చేయడం విశేషం. మధ్యలో హీరోలేం చేశారు అని ఆశ్చర్యం కలగుతోంది కదా..? దీనికి ఆయన కారణం చెప్పారు. కర్నూలులో చాలా షూటింగ్‌లు జరుగుతున్నాయని, దీని వల్ల హీరోలు వేల కోట్లు సంపాదించేస్తున్నారని.. అందుకుగాను కర్నూలులో హైకోర్టు పెట్టాలని హీరోలు గళం విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో లాజిక్ ఏంటన్నది పక్కన పెడితే.. పేరుకు కర్నూలులో హైకోర్టు అని ప్రకటించేసి ఆ దిశగా జగన్ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయని సంగతి ఈ మధ్యే తేటతెల్లం అయింది. హైకోర్టును అమరావతి నుంచి తరలించాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వ్యాఖ్యానించినట్లు వెల్లడి కావడం ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. 

హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడం సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు బలంగా చెబుతున్నారు. మరోవైపు కర్నూలులో హైకోర్టు పెట్టినంత మాత్రాన సీమ ప్రాంతానికి పెద్దగా ఒదిగేదేమీ లేదన్న చర్చా నడుస్తోంది. కానీ జగన్ సర్కారు మాత్రం ఈ అంశం మీద రాజకీయం మాత్రం ఆపట్లేదు. ఈ క్రమంలో మంత్రి గారు టాలీవుడ్ హీరోల మీద పడడం విడ్డూరంగా అనిపిస్తోంది.