ఏపీలో రెడ్డి సోషల్ ఇంజినీరింగ్

సోషల్ ఇంజినీరింగ్ అంటే అన్ని కులాలకు సమాన ప్రాధ్యానం ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క కులానికి సోషల్ ఇంజినీరింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికే పెత్తనమిచ్చారని ఆరోపించిన వైసీపీ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పని చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. తాజాగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని నియమించడంతో విపక్షాలు తమ ఆరోపణలకు పదును పెడుతున్నాయి… సీనియర్లైన నీరభ్ కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్, గిరిధర్ అర్మాణేలను కాదని జవహర్ రెడ్డిని సీఎస్ గా ఖరారు చేశారు…

బీసీలు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్ద పీట వేస్తామని జగన్ చెబుతారు. చెప్పినట్లుగా కేబినెట్లో పదవుకు కూడా ఇస్తారు. వినడానికి, చూడటానికి బాగానే ఉంటుంది. అంతకు ముంచి కథ వేరుగా ఉంటుంది. కీలక కేబినెట్ పదవులు మాత్రం రెడ్డి వర్గానికే ఉంటాయి. . బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. సకల శాఖా మంత్రి అన్న పేరు తెచ్చుకున్నారు. సీఎంఓలో ధనుంజయ్ రెడ్డి ఏం చేస్తున్నారో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 12 మంది సీనియర్ ఐపీఎస్ లను కాదని కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారు.

వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా విజ‌య సాయిరెడ్డి…లోక్‌స‌భ ప‌క్ష నేత‌గా మిధున్ రెడ్డి..టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బా రెడ్డి..సీఎం సల‌హాదారుడిగా అజ‌య్ క‌ళ్లాం రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పదవులే ఉన్నాయి. వీళ్లు కాకుండా వైసీపీలో శ్రీకాంత్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్లు ఏదోక పదవిలో కనిపిస్తూనే ఉంటాయి. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రసాద్ రెడ్డి, వేంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా రాజా రెడ్డి ఉన్నారు. నిజానికి రాజా రెడ్డి రిటైరై చాలా రోజులైంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారిని కాదని రాజారెడ్డి తీసుకొచ్చి వీసీగా పెట్టారు.

రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇవ్వడంపై వైసీపీలో ఒక వాదన వినిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ విజయానికి వారు కష్టపడి పనిచేశారని, చాలా మందికి పదవులు ఇవ్వలేకపోయినా వైసీపీని అంటి పెట్టుకుని ఉన్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంగబలం, అర్థబలం, రాజకీయ బలంతో పాటు తిమ్మిని బొమ్మిని చేయగల సత్తా తమ సామాజిక వర్గానికి ఉందని జగన్ భావిస్తున్నందనే వారిని పెద్ద పీట వేశారని చెబుతున్నారు. పైగా జగన్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా ఉంది కదా…