ఇప్పుడు త‌లెక్క‌డ పెట్టుకుంటావ్ జ‌గ‌న్‌?: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీం కోర్టు బదిలీ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?’’ అని చంద్రబాబు నిల‌దీశారు. దీనిపై ఏమాత్రం సిగ్గున్నా.. సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీ నామా చేయాలని డిమాండ్‌ చేశారు.

బాబాయ్‌ వివేకాను చంపించింది అబ్బాయేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ‘‘బాబాయ్‌ హత్య కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్‌ చంచల్‌గూడ జైలుకి’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బదిలీపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరిం చింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని.. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా పేర్కొన్నారు.

టీడీపీ రియాక్ష‌న్‌

వివేకా హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు మాయని మచ్చ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తనలో ఏమాత్రం నైతికత మిగిలి ఉన్నా జగన్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ చేయడంపై జగన్‌ ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. తాడేపల్లి ప్యాలెస్‌ ప్రమేయాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ బ్యాచ్‌ పథకం ప్రకారమే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని.. ఈ విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేటతెల్లమైందన్నారు.