ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. టీఆర్ఎస్‌దే అధికారం: జ‌గ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మ‌రోసారి భారీ బాంబు పేల్చారు. ఇప్ప‌టికిప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిగితే.. కాంగ్రెస్ నెంబ‌రు 2 పొజిష‌న్‌లోకి వ‌స్తుంద‌న్నారు. మ‌రోసారి సీఎం కేసీఆరే ముఖ్య‌మంత్రి అవుతార‌ని, టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న హైటెక్ డ్రామాలకు ఓట్లు రాలవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లకు వెళ్తే అధికార పార్టీ టీఆర్ఎస్‌ మొదటి స్థానంలో, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలు జరుగుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పడం వాస్తవం కాదని వ్యాఖ్యానించారు.

పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని వివరించారు. ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేసిన జగ్గారెడ్డి, రేవంత్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఎందుకు తొందరపడి ఇచ్చారో అడుగుతానన్నారు. రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితో పాదయాత్ర చేసినట్లయితే, తనతో పాటు అందరం సహకరిస్తామని స్పష్టం చేశారు.

“రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నేను ఫూల్గా సహకరిస్తా, ఇప్పుడు అన్నిటికీ సమస్య, పరిష్కారం జగ్గారెడ్డి మాత్ర‌మే. చాలా ఒపెన్ మైన్డ్గా మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా అంతే మాట్లాడుతాను. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఆయనకు పర్మిషన్ ఇచ్చి పాదయాత్రకు బయలుదేరు అంటే.. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను పూర్తిగా సహకరిస్తాను” అని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.