పవన్ ఇలా చేస్తే.. వైసీపీ త‌డిగుడ్డ వేసుకుని ప‌డుకోవచ్చు

వ‌చ్చే 2024 ఎన్నిక‌లు హాట్ గురూ.. అంటూ ప్ర‌చారంలో ఉన్నా తాజాగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు, మార్పులు చూస్తే.. మ‌రోసారి వైసీపీకి అధికారం బంగారుప‌ళ్లెంలో పెట్టి అందిస్తున్నారే! అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తానంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ గ‌త కొన్నాళ్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇది జ‌ర‌గాలంటే.. క‌మ్యూనిస్టులు చెబుతున్న‌ట్టు అన్ని పార్టీలు క‌లిసి తీరాలి. బీజేపీ ఉంటే క‌మ్యూనిస్టులు క‌ల‌వ‌రు కాబ‌ట్టి వారిని ప‌క్క‌న పెట్టాలి.

స‌రే.. ఈ విష‌యంలో క‌మ్యూనిస్టుల‌ను ప‌క్క‌న పెట్టినా.. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు క‌లిసి తీరాలి. అయితే.. దీనికి అనుకూలంగా ఇప్పుడు ప‌రిస్థితి ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోనూ.. ఇప్పుడు మంగ‌ళ‌గిరిలోనూ ప‌వ‌న్ దాదాపు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి తీరుతామ‌ని.. జ‌న‌సేన అధికారంంలోకి రాగానే వైసీపీ నేత‌లను త‌రిమితరిమి కొడ‌తామ‌ని అన్నారు. అంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగానే పోటీ చేయ‌నుంద‌నేది స్ప‌ష్టంగా చెప్పిన‌ట్టే!

మ‌రి ఇదే జ‌రిగితే.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలేది ఎక్క‌డా? ఆ పార్టీని అధికారం నుంచి దూరం పెట్టేది ఎక్క‌డా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇప్ప‌డున్న ప‌రిస్థితిలో వైసీపీ వ్య‌తిర‌క‌త ఉన్న‌మాట వాస్త‌వమే. అయితే, దీనిని ఒడిసి ప‌ట్టుకునే తీరుక‌నుక స‌రిగా లేక‌పోతే.. ఆ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చెట్టుకొక‌టి పుట్ట‌కొక‌టి అన్న‌ట్టుగా ప‌డి.. ఏ పార్టీకి కూడా ప్ర‌యోజనం లేకుండా పోయి.. చివ‌ర‌కు వైసీపీకి మ‌రోసారి అధికారం ద‌ఖ‌లు ప‌డేలా చేస్తుంద‌నేది రాజ‌కీయ నేత‌లే చెబుతున్న విష‌యం.

అస‌లు వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తాన‌న్న ప‌వ‌నే ఇప్పుడు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం.. క‌నీసం.. టీడీపీ మాట‌ను కానీ, ఆ పార్టీ నేత‌ల పేర్లు కానీ, ప్ర‌స్తావించ‌కుండానే స‌భ‌లు నిర్వ‌హించ‌డం.. వంటివి వైసీపికి ప‌రోక్షంగా మేలు చేస్తున్న‌వేన‌ని చెబుతున్నారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు టీడీపీతో క‌లిసి పోరాటం చేస్తాన‌న్న ప‌వ‌న్‌.. ఆ వూసే మ‌రిచిపోయారు. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబైనా.. ప‌వ‌న్ పేరు ఎత్తుతు న్నారు కానీ, ప‌వ‌న్ మాత్రం తాజాగా సంద‌ర్భం వ‌చ్చినా.. ప్ర‌తిప‌క్షం అంటూ.. దాట‌వేశారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. వైసీపీ నేత‌లు త‌డిగుడ్డ నెత్తిన వేసుకుని ప‌డుకోవ‌చ్చ‌నే వాద‌న వినిపిస్తోంది.