‘వైఎస్ క‌నుసైగ చేసి ఉంటే.. బాబు అప్పుడే అయిపోయేవారు!’

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కుడు, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోనే చంపేసేవాడని వ్యాఖ్యానించారు. తమ ప్రాంతంలో హత్యా రాజకీయాలు జరిగితే.. మొదట చంద్రబాబు కొడుకునే టార్గెట్ చేస్తామని హెచ్చరించా రు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు పై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

తెలుగుదేశం హయాంలో రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది తెలంగాణకు తరలిపోయింది. అయితే, దీనికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బెదిరింపులే కారణమని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప‌రిటాల సునీత ఇవే వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖ‌ర్ రెడ్డి రగిలిపోయారు.

తాజాగా రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆయ‌న చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వెలుగు చూశాయి. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి చంద్రబాబును పరుష పదజాలం తో దూషించారు. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడాన్ని అడ్డుపెట్టుకొని తమ కుటుంబం మీద, తమ సోదరుడి మీద అనేక రకాలుగా వార్త‌లు రాయిస్తున్నార‌ని, వాటిని భరించలేకపోతున్నామని అన్నారు.

రూ.వేల కోట్లు సంపాదించుకున్న సీఎం రమేష్, సుజనా చౌదరిని బీజేపీ దగ్గర పెట్టావ్ కదా చంద్రబాబూ. మరో వైపు కమ్యూనిస్టులను పోషిస్తున్నావ్‌. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవు. నీవు రెండెకరాల భూస్వామివి. మాకు 500 ఎకరాల భూమ ఉంది. నీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సీబీఐ దర్యాప్తు జరిపిద్దామా? అని సవాలు విసిరారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనుసైగ చేసుంటే మీ ప్రాణాలు ఉండేవి కాదని చంద్రబాబును హెచ్చరించారు. తమ ప్రాంతంలో హత్యారాజకీయాలు జరిగితే తమ మొదటి టార్గెట్ నారా లోకేషే నని చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రకు ముందు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆయనను టార్గెట్ చేస్తామని నేరుగా హెచ్చరించడం కలకలం రేపుతోంది. దీనిపై టీడీపీ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.