అతి చేసిన అనిల్ అన్నకు కష్టకాలం

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లా పార్టీలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఎదురుగాలి వీస్తోంది. జిల్లాలో ఆయన వ్యతిరేకవర్గం బలపడుతున్న తరుణంలో ఇప్పడు ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి కూడా అనిల్ ను తప్పించారు. జిల్లాలో రోజురోజుకు అనిల్ యాదవ్ ఒంటరవుతున్న తరుణంలో పుండు మీద కారం చల్లినట్లుగా తిరుపతి జిల్లా ప్రాంతీయ సమన్వయ సమన్వయకర్త బాధ్యతలు చేజారాయి. పనిచేయని వారిని తీసేస్తానని సీఎం జగన్ సందేశమిచ్చిన నేపథ్యంలో అనిల్ యాదవ్ పరిస్థితి ఆగమ్యగోచరమైంది.

ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు అనిల్ యాదవ్ కూడా పదవిని కోల్పోయి సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. కొద్ది రోజులు అధిష్టానంపై తిరుగుబాటు చేసిన స్థాయిలో ప్రవర్తించారు. కొత్తగా మంత్రి అయిన కాకాని గోవర్థన్ రెడ్డికి సహకరించకుండా రచ్చ రచ్చ చేశారు. కాకాని మీటింగులకు పోటీ సమావేశాలు నిర్వహించారు. దానితో ఇద్దరినీ పిలిపించి జగన్ వారి మధ్య రాజీ కుదిర్చారు. అప్పటికి మౌనం వహించినా తర్వాత అనిల్ తన దూకుడును కొనసాగించారని చెబుతారు. దానితో అధిష్టానంలోని కొందరి ఆశీస్సులతో అనిల్ వ్యతిరేకవర్గం క్రియాశీలమైంది…

నెల్లూరు జిల్లాలో జనం వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా అధిష్టానం ఆదేశాల మేరకు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలి కదా.. అనిల్ కూడా ఆ పనే చేస్తున్నాయి. అయితే అనుకూల మీడియాను తీసుకెళ్లడం, ముందే ఎంపిక చేసి మాట్లాడుకున్న కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్లడం లాంటి చర్యలకు దిగుతున్నారు. అనిల్ ఆధ్వర్యంలో మమ అన్నట్లుగా గడప గడపకు కార్యక్రమం జరుగుతోంది.. ఆయనకు స్థానిక నేతలు, కేడర్ నుంచి మద్దతు రావడం లేదు. కార్యకర్తలు, నేతలే కాదు.. కార్పొరేటర్లు కూడా ముఖం చాటేస్తున్నారు.కార్యక్రమానికి వస్తామని చెప్పిన నేతలు కడుపు నొప్పి, కాలు నొప్పి అంటూ డుమ్మా కొట్టేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రాణాలైనా ఇస్తామంటూ నిలబడ్డ అనుచరులు.. ఇప్పుడు అనిల్‌కు దరిదాపుల్లో కూడా కనిపించకపోవడం ఆయనకు ఇబ్బందిగా మారుతోంది. వైసీపీలో క్రియాశీలంగా ఉండే సొంత బాబాయ్ రూప్‌కుమార్ ఏకంగా ఓ వర్గాన్నే కూడగడుతున్నారు. అనిల్ గర్వమే ఇప్పుడు ఆయన్ను దెబ్బకొడుతున్నట్లు భావిస్తున్నారు. తన ఆప్త మిత్రుడైన నుడా చైర్మన్ ద్వారకానాథ్ కూడా దూరమయ్యారు.. నగర మేయర్ స్రవంతి .. ఇప్పుడు అనిల్ పరిధిలోని ఏరియాల్లోకి అడుగు పెట్టడం లేదు.

దిక్కుతోచని అనిల్ ఇప్పుడు జనాన్ని కూడగట్టి బల నిరూపణకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్ని తన చుట్టూ తిప్పుకునేందుకు, కొత్త కేడర్ ను సృష్టించుకునేందుకు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారని చెబుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతే ప్రస్తుతం దెబ్బకొడుతోందని కొందరంటున్నారు. రోడ్ల నిర్మాణం, ఆక్రమణల తొలగింపు లాంటి అంశాల్లో ఆయనకు భారీగా ముడుపులు అందాయి. గత్యంతరం లేక భారీగా సమర్పించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు అనిల్ ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని కష్టాల మధ్య వచ్చే ఎన్నికల్లో అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ వస్తుందో లేదో చూడాలి…