నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానులు కావాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తే..సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో చంద్రబాబు అక్కడికి రావడంతో ఘర్షణ తారస్థాయికి చేరింది. పోలీసులు అక్క‌డే ఉన్నా వైసీపీ కార్యకర్తలను అదుపు చేయకపోవడంతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి. పోలీసులు యూనిఫాం తీసేసి రావాలి.. మీతో కాకపోతే మేమే చూసుకుంటాం. ఎస్పీ ఏం చేస్తున్నారు? ఎవరికి కాపలా కాస్తున్నారు? పేటీఎం బ్యాచ్‌కు బిర్యానీ ప్యాకెట్‌ ఇచ్చి రెచ్చగొట్టి పంపారు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా.. మీ సంగతి చూస్తా. రాయలసీమలో ముఠా నాయకులను అణచివేసిన పార్టీ టీడీపీ. మిమ్మల్ని అణచివేయడం కష్టమేమీ కాదు’ అని బాబు నిప్పులు చెరిగారు.

రాజకీయ రౌడీలు వస్తున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని చంద్ర‌బాబు సూచించారు. “చేతకాని దద్దమ్మ జగన్‌. కర్నూలులో బెంచ్‌ పెట్టాలని నేనే చెప్పాను. మీ వల్ల కాకపోతే చెప్పండి .. నేనే చూసుకుంటా. ఓడిపోతారని తెలిసి జగన్‌ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు’’ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అంతేకాదు.. ‘‘నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను.. ప్రజలకు తప్ప మరెవ్వరికీ భయపడను.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తా.. నన్ను రెచ్చగొట్టిన వాళ్ల పతనం ఖాయం.. వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి’’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.