రాజస్థాన్ డ్రామా.. మోడీ-షాకు షాక్?

కర్ణాటక ఆపరేషన్ అయిపోయింది. మధ్య ప్రదేశ్‌లోనూ విజయవంతంగా పని పూర్తి చేశారు. ఇప్పుడిక రాజస్థాన్ మీద పడింది నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ. ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు తిరస్కరించినా సరే.. ప్రత్యర్థి పార్టీలో అదను చూసి అసమ్మతి రాజేసి.. తమ అండదండలు ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకునేలో ఉంది మోడీ-షా జోడీ.

కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడా ప్రయోగిస్తోంది. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ను దువ్వి.. దాదాపు 30 మంది ఎమ్మెల్యేను చీల్చి అశోక్ గెహ్లోత్ సర్కారును కూల్చడానికి కొన్ని రోజులుగా ప్రణాళిక రచిస్తోంది. రెండు రోజులుగా ఆ వ్యూహాన్ని అమల్లో కూడా పెట్టారు.

ఇక గెహ్లోత్ సర్కారు కూలిపోవడమే తరువాయి అన్నట్లుగా జాతీయ మీడియాలోనూ వార్తలొచ్చాయి. మోడీ-షా తలుచుకుంటే ఫ్లాన్ ఫెయిలవడమా అంటూ అందరూ ఎలివేషన్లు కూడా ఇచ్చారు. కానీ వీరికి రాజస్థాన్‌లో షాక్ తగలబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. నిన్న మీడియా ముందు గెహ్లోత్ తన బలాన్ని రుజువు చేసుకున్నారు. మెజారిటీ మార్కు 101 కాగా.. ఆయన వెంట 102 మంది ఉన్నారు అప్పటికి. ఇంకో ఏడుగురు గెహ్లోత్ సర్కారుకు మద్దతుగా లేఖలు రాసినట్లు చెబుతన్నారు.

సచిన్ వర్గం అనుకున్న ఎమ్మెల్యేలు గెహ్లోత్‌తోనే కనిపించడం, మీడియా ముందు బల పరీక్షలో వాళ్లే ముందు నిలబడటం విశేషం. వీళ్లను ఇట్నుంచి ఇటే శిబిరానికి తరలించారు. దీన్ని బట్టి చూస్తే సచిన్ వెంట 30 మంది ఎమ్మెల్యేలున్న మాట నిజం కాదనిపిస్తోంది. ఐతే అసెంబ్లీలో బల నిరూపణ సమయానికి పరిస్థితి ఏమైనా మారి గెహ్లోత్‌కు షాక్ ఏమైనా తగులుతుందేమో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే మోడీ-షా ప్లాన్ ఫెయిలైనట్లే కనిపిస్తోంది.