‘క్యాసినో కేసు’లో మంత్రి త‌ల‌సాని సోద‌రుల హ‌స్తం?

తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నాళ్ల కింద‌ట‌ సంచలనం సృష్టించిన చీకోటి ప్ర‌వీణ్ క్యాసినో కేసు వ్యవహారంలో తాజాగా మరో సంచ‌ల‌న‌ విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ సోదరులకు భాగం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓ ర‌హ‌స్య ప్ర‌దేశంలో వీరిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

తెలంగాణలోని చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మళ్లీ దృష్టి సారించింది. మూడునెలల తర్వాత తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్‌, అనుచరుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించి మరో వ్యక్తికి సంబంధించి కీలక పత్రాలు బ్యాంకు ధ్రువపత్రాలు సేకరించారు. వాటి పరిశీలన తర్వాత మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు.

వాటి ఆధారంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ సోద‌రులు త‌ల‌సాని మహేశ్‌, త‌ల‌సాని ధర్మేందర్‌ యాదవ్‌ని పిలిచి విచారించారు. వీరు చీకోటితో కలిసి క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నగదు, ఆర్థిక లావాదేవీల విషయంలో హవాలాకు పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే కేసులో మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా మెదక్‌ సహకార బ్యాంకు ఛైర్మన్‌కు, ఏపీలోని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే(టీడీపీ)కు కూడా నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఈడీ విచారణకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. సోమవారం అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అధికారుల ఎదుట విచారణకు రావాల్సి ఉంది.