ఈ సీరియల్ ఇంకెంతకాలం సోనియమ్మ?

తెలుగు టీవీ సీరియల్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం నడుస్తుందని చెప్పాలి. ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు రాహుల్ కు అప్పజెప్పటం.. అయ్యాగారు గౌతమ బుద్ధుడి మాదిరి.. పదవుల మీద తనకు పెద్ద ఆసక్తి లేదని చెప్పేయటం.. సోనియమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవటం.. అధినాయకుడు లేక పార్టీ కిందా మీదా పడటం గడిచిన కొన్నాళ్లుగా చూస్తున్నదే. అలా అని పార్టీ పగ్గాలు మరెవరి చేతుల్లో పెట్టేందుకు గాంధీ ఫ్యామిలీకి ఇష్టం లేని పరిస్థితి.

ప్రియాంకను సీన్లోకి తీసుకొస్తే.. ఏదేదో జరిగిపోతుందన్న ప్రచారానికి.. వాస్తవానికి మధ్య వ్యత్యాసం అర్థం కావటమే కాదు.. ప్రియాంక ప్రభావం పెద్దగా ఉండదన్న విషయం మీదా పార్టీ అధినాయకత్వానికి అవగాహన వచ్చినట్లేనని చెబుతున్నారు. ఇలాంటివేళ.. పగ్గాలు అప్పగించే వారి కోసం సోనియమ్మ ఎదురుచూసే పరిస్థితి. ఇదిలా ఉంటే.. పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చునేందుకు రాహుల్ సిద్ధంగా లేకపోవటంతో భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఎవరికి ఎలాంటి స్పష్టత లేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా దేశ రాజకీయ పరిణామాల్ని మాట్లాడేందుకు పార్టీ ఎంపీలతో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు.. అసోం.. బీహార్.. ఒడిశా.. కేరళకు చెందిన నేతలు రాహుల్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సోనియమ్మను కోరారు. అయితే.. ఈ డిమాండ్ల విషయంపై సమావేశంలో పాల్గొన్న అమ్మాకొడుకులు ఇద్దరు మౌనంగా ఉండటం.. స్పందించకపోవటం గమనార్హం.

ఇదే డిమాండ్ ను గత నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మధ్యప్రదేశ్ కు చెందిన దిగ్విజయ్ సింగ్ సైతం రాహుల్ కు పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్ చేసిన వారిలో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవిని త్యజించిన తర్వాత ఆయనకు పార్టీ పగ్గాలు అందించేందుకు ప్రయత్నాలు జరిగినా.. రాహుల్ మాత్రం సానుకూలంగా స్పందించని పరిస్థితి నెలకొంది. చూస్తుంటే.. అంతులేని కథలా మారిన ఈ వ్యవహారానికి ముగింపు ఎప్పుడన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.