బెంగళూరులోనూ పెట్టేశారు.. ఇక మిగిలింది హైదరాబాదే

కరోనా ప్రభావాన్ని తగ్గించడం కోసం రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను చాలా పకడ్బందీగా అమలు చేశారు. కొన్ని రాష్ట్రాలు ఇక లాక్ డౌన్ చాలు అన్నా కేంద్రం వినిపించుకోలేదు. కచ్చితంగా లాక్‌డౌన్‌‌ను కొనసాగించాల్సిందే అని స్పష్టం చేసింది. ఐతే జూన్ నెల ఆరంభం నుంచి లాక్ డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేసింది కేంద్రం. అప్పట్నుంచి దాదాపుగా అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్ ఎత్తేశాయి. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో షరతులు పెడుతూ బండి నడిపిస్తున్నారు. ఐతే లాక్ డౌన్ ఎత్తేశాక కరోనా కేసుల ఉద్ధృతి పెరిగిపోయిన నేపథ్యంలో దేశంలోని కొన్ని పెద్ద నగరాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. దక్షిణాది విషయానికి వస్తే ముందుగా తమిళనాడులోని చెన్నైతో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ మళ్లీ విధించారు. ఆపై కేరళ ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. కరోనా కేసులు అధికంగా ఉన్న తిరువనంతపురంలో లాక్ డౌన్ అమలు చేసింది.

ఇక సౌత్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న నగరాలంటే మన హైదరాబాద్, పొరుగు రాష్ట్రంలోని బెంగళూరు. ఐతే హైదరాబాద్‌లో జులై 1 నుంచి మళ్లీ లాక్ డౌన్ పెట్టబోతున్నారని గట్టిగా ప్రచారం జరిగింది కానీ.. అలా ఏమీ జరగలేదు. ప్రభుత్వ తీరు చూస్తే మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఉద్దేశం లేనట్లు కనిపించింది. కానీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్లుండి లాక్ డౌన్ ప్రకటన చేశారు. ఈ నెల 14న రాత్రి 8 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందట. అత్యవసర వస్తువులు, సేవలకు మినహా దేనికీ అనుమతి లేదు. అన్నీ మూతపడనున్నాయి. వారం పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని.. పూర్తి మార్గదర్శకాల్ని సోమవారం విడుదల చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూపర్ప ప్రకటించారు. మూడు రోజుల ముందే లాక్ డౌన్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ గ్యాప్‌లో జనాలు అవసరమైన సరంజామా అంతా తెచ్చిపెట్టుకోనున్నారు. సౌత్‌లోని మూడు ప్రధాన నగరాల్లో కరోనా నియంత్రణ కోసం మళ్లీ లాక్ డౌన్ అమలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా మళ్లీ లాక్ డౌన్ పెట్టే అవకాశాల్ని కొట్టిపారేయలేం.