మునుగోడు చిత్రం.. ఓటుకు నోటు కోసం గొడవ

ఎన్నికల సమయంలో ఓటు కోసం నోటు పంచడం అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది ఇప్పుడు. నిత్యావసరాలు పెరిగినట్లే ఒక ఎన్నిక నుంచి ఇంకో ఎన్నికకు వచ్చేసరికి ఓటు రేటు కూడా పెరిగిపోతోంది. ఈ రేట్ల విషయంలో తెలంగాణ పైపైకి ఎగబాకుతుండడం విశేషం. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎలా డబ్బు, మద్యం ఏరులై పారింద తెలిసిందే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

ఓటుకు మినిమం రేటు రూ.5 వేలు పలుకుతోందక్కడ. దీనికి తోడు బంగారు కానుకలు, క్రికెట్ కిట్లు, విందులు, వినోదాలు.. ఇలా ఓటర్లను మెప్పించే ప్రయత్నాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. కాగా మునుగోడు ఉప ఎన్నికకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండగా.. ఈ నియోజకవర్గంలోని కొరిటికల్ గ్రామంలో ఊహంచని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మిగతా గ్రామాలకు ఇచ్చినట్లు తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటూ ఈ గ్రామస్థులు ఆందోళన నిర్వహించే పరిస్థితి తలెత్తింది.

ఇతర గ్రామాల్లో బీజేపీ నేతలు ఓటుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు డబ్బులతో పాటు తులం బంగారం ఇస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఈ గ్రామస్థులు.. తమకు మాత్రం ఈ కానుకలు ఎందుకు ఇవ్వట్లేదని, తమ మీద ఈ వివక్ష ఎందుకని ఆ పార్టీ నేతల ఇళ్ల ముందు వచ్చి ఆందోళన చేపట్టారు. ఉప ఎన్నికకు ఒక్క రోజే సమయం ఉండగా.. మళ్లీ ఛాన్స్ ఉండదని గ్రామస్థులు ఈ మేర ఆందోళన బాట పట్టారు. ఓటుకు నోటు కోసం ఇలా ఆందోళన చేపట్టడం, ఈ చైతన్యం చూసి అందరూ షాకవుతున్నారు.

సమస్యల గురించి నేతలను నిలదీసే విషయంలో వెనుకంజ వేసే జనాల్లో ఇక్కడ మాత్రం భలే చైతన్యం వచ్చిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. కాగా గత నెల రోజుల వ్యవధిలో మునుగోడు నియోజకవర్గంలో కేవలం మద్యం అమ్మకాలు మాత్రమే రూ.200 కోట్ల మార జరిగినట్లు సమాచారం. భారతీయ చరిత్రలోనే ఒక నియోజకవర్గ పరిధిలో జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలు ఇవే కాబోతున్నాయనడానికి ఇంతకంటే రుజువేం కావాలి?