చేతులు ఎత్తి ద‌ణ్నం పెట్టి చెబుతున్నా.. : కేసీఆర్‌

మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో కేసీఆర్ పాల్గొన్నారు. ప్ర‌సంగించింది చాలా కొద్దిసేపే అయినా..సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. “ఎన్నిక‌లు రాగానే మ‌న‌కొక గ‌త్త‌ర ప‌ట్టుకుంటుంది. కొంద‌రు ఎన్నిక‌లు వ‌స్తే గాలిపైనే న‌డుస్త‌రు. ఒక గాలి కాదు.. ఒక గ‌త్త‌ర కాదు. విచిత్ర వేష‌గాళ్లు.. అనేక మంది.. అనేక పార్టీలు వ‌స్తాయి. వాళ్ల‌కు గాయ్‌గాయ్ గ‌త్త‌ర వ‌స్త‌ది. మ‌న‌కెందుకు రావాలి? ద‌య‌చేసి ఆలోచించండి. నేను చెప్పాన‌ని కాదు. త‌మ్మినేని వీర‌భ‌ద్రం చెప్పార‌ని కాదు.. ఎవ‌రు చెప్పినా.. ఇంటికెళ్లి ఆలోచించండి. ఓటు అనేది శ‌క్తిమంత‌మైన ఆయుధం. ఒళ్లు మ‌రిచిపోయి వేస్తే.. ఒళ్లు కాలిపోత‌ది. స‌మాజానికి ఉపయోగ‌కరం ఏంట‌నేది తెలుసుకుని వేస్తే తెలంగాణ‌కు, మునుగోడుకు మంచి జ‌రుగుతుంది” అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేతులు ఎత్తి ద‌ణ్ణం పెడుతున్నాన‌ని.. ఆలోచించి ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న పెద్ద‌ల‌కు రాజ‌కీయ విభేదాలు ఉండొచ్చు. కానీ, ఓటేసేప్పుడు ఆలోచించి వేయాల‌ని కోరుతున్నాన‌న్నారు. ఎప్పుడైతే ఆలోచించి ఓటేయ‌రో.. అప్పుడు దేశంలో ఇలాంటి పార్టీలు లొల్లి జ‌రుగుతూనే ఉంటుందని హెచ్చ‌రించారు. “ఎందుకీ అరాచ‌కం.. దేశానికి ఎలా మంచిది? ఎందుకు ప్రోత్స‌హిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ ఎందుకు చేస్తున్నారు. మోడీ ప్ర‌మేయం లేకుండా ఈ డ‌బ్బు ఎక్క‌డ నుంచి వ‌చ్చింది” అని ప్ర‌శ్నించారు.

“కొంత‌మంది ఆర్ఎస్ఎస్ వాళ్లు హైద‌రాబాద్‌కు వ‌చ్చి అరాచ‌కం చేసి.. ఇప్పుడు చంచ‌ల్ గూడ జైల్లో ఉన్నారు. దీనిపై విచార‌ణ జ‌ర‌గాలి. దీనివెనుక ఎవ‌రున్నారో వారు ఒక్క క్ష‌ణం కూడా ఆప‌ద‌వుల్లో ఉండొద్దు. మ‌నం మౌనంగా ఉండొద్దు. మౌనమే శాపం కావొద్దు. వ‌డ్లు కొన‌డం చేత‌కాలేదు.. వంద‌ల కోట్టు పెట్టి ఎమ్మెల్యేల‌ను కొంటున్నారు” అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.

“మునుగోడులో యుద్ధం చేయాలి. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం చేనేతలకు చేశారు. నేతన్నలపై జీఎస్టీ విధించి మళ్లీ వాళ్లనే ఓట్లు అడుగుతున్నారు. చేనేత కార్మికులు మునుగోడులో బీజేపీకి ఓటు వేయాలా? బీజేపీకి ఓటు వేయకుండా చేనేతలు బుద్ధి చెప్పాలి. ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా?. పెట్టుబడి దారులు, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోంది” అని కేసీఆర్ పిలుపునిచ్చారు. స‌భకు భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు. అనుకున్న స‌మ‌యానికంటే అర్ధ‌గంట ఆల‌స్యంగా స‌భ ప్రారంభ‌మైంది.