కాంగ్రెస్‌కు మోడీ భారీ షాక్‌!!

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుతో ఒక‌రి త‌ర్వాత‌..ఒక‌రుగా విచార‌ణ‌లుఎదుర్కొంటూ.. ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌కు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో భారీ షాక్ ఇచ్చింది. ఈ దెబ్బ‌తో కాంగ్రెస్ కోలుకోవ‌డం.. క‌ష్ట‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ఈ షాక్‌తో రాహుల్ త‌న భార‌త్ జోడో యాత్ర‌ను అర్ధంత‌రంగా విర‌మించుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిపోయారు.

ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్జీఓలకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్జీల ఎఫ్సీఆర్ఏను అంటే.. విదేశాల నుంచి విరాళాలు సేక‌రించేందుకు వినియోగించుకునే లైసెన్సులను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు వివ‌రాల‌ను వక్రీకరించడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.

హోం శాఖ లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్డీఓలకు సోనియాగాంధీ ఛైర్పర్సన్గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ను 2002లో నెలకొల్పారు.

ఇదిలావుంటే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న భార‌త్‌ జోడో యాత్ర తెలంగాణ‌లో ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. దీనిని ర‌ద్దు చేసుకుని.. ఆయన హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి న్యూఢిల్లీకి వెళ్లిపోయారు.