రూ.100 కోట్ల ‘మెగా’ ఆఫర్ కు షర్మిల నో!

తెలంగాణ రాష్ట్రంలో కాకలు తీరిన రాజకీయ నేతలు.. అధినేతలు ఉన్న వేళ.. వారందరికీ మించిన రీతిలో వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల వ్యవహరించిందన్న మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. ఈ ప్రాజెక్టులో ఏకంగా రూ.50 వేల కోట్ల దోపిడీ జరిగిందన్నది ఆమె వాదన. అంతేకాదు.. రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగవేత మీదా ఆమె కంప్లైంట్లు చేస్తున్నారు.

కొత్త రాష్ట్రమైన తెలంగాణలో లక్ష కోట్లు దాచుకొని ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేని దీన స్థితికి మెగా సంస్థ కారణమైందన్న షర్మిల వాదన. అంతేకాదు.. మెగా దోచుడు మీద తాను మౌనంగా ఉంటే రూ.100 కోట్లు ఆఫర్ చేశారని.. దానిపై షర్మిల సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక్క షర్మిల తప్పించి.. మిగిలిన వారెవరూ ఈ మెగా దారుణాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్న దానిపైనా సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు నెలవారీగా జీతాలు ఇస్తారని.. తామిచ్చే ఫండ్ తోనే రాజకీయ పార్టీలు నడిచేదన్న విషయాన్ని తనకు చెప్పినట్లుగా షర్మిల.. తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తమ వార్తలు మరే మీడియాలోనూ రాకుండా ఉండటానికి భారీ ఎత్తున మేనేజ్ చేస్తున్నట్లుగా షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ కారణంతోనే తమ కుంభకోణాలకు సంబంధించిన ఏ వార్తలు ఏ మీడియాలోనూ రావన్న ధీమాను ఆమె వద్ద వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

కాళేశ్వరం విషయంలో మౌనంగా ఉంటే మంచిదని షర్మిలకు సూచన చేయటం.. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. వదిలేదే లేదన్న విషయాన్ని తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మళ్లీ ఢిల్లీకి వెళ్లి.. కాళేశ్వరం మీద మరోసారి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. కాళేశ్వరం పాపాల పుట్ట పగలటం మొదలైతే.. మెగా దారుణాలు మరిన్ని బయటకు వస్తాయంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.