వైసీపీ నిరంకుశ ధోర‌ణికి బుద్ధి చెప్పండి: బాల‌య్య‌

సాధార‌ణంగా ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవు. అందునా.. ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగేందుకు మరో ఏడాదిన్న‌ర‌ పైగానే స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్పుడే.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, అన్న‌గారి కుమారుడు.. నంద‌మూరి బాల‌కృష్ణ రంగంలోకి దిగారు. వైసీపీ ప్ర‌భుత్వ నిరంకుశ ధోర‌ణికి బుద్ధి చెప్పాల‌ని.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు మాత్ర‌మే కాదు.. మేధావులు, విద్యావంతుల‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న సెల్పీ వీడియోను తీసుకుని.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి కార‌ణం.. త్వ‌ర‌లోనే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే.. వారిని గెలిపించాల‌ని బాల‌య్య పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి‌ని గెలిపించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపు నిచ్చారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో టీడీపీ తరుపున రాంగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఉన్నత విద్యావంతుడైన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. పట్టబద్రులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశధోరణి అవలంభిస్తుందని బాలకృష్ణ ఆరోపించారు. ఆ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పేందుకు.. ఇదే తొలి అవ‌కాశ‌మ‌ని బాల‌య్య తెలిపారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించి ఓటేయాల‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో త‌మ ఓట్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని.. గ్రాడ్యుయేట్ల‌కు .. బాల‌య్య సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయ‌డం ద్వారా.. ఓటు ద్వారా.. వైసీపీకి బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. మొద‌టి ప్రాధాన్య‌తా ఓటును భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి వేయాల‌ని సూచించారు. ఆయ‌న పార్టీలో సుదీర్ఘ‌కాలంగా ప‌నిచేస్తున్నార‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘంలో బాధ్య‌లు నిర్వ‌హిస్తున్నార‌ని.. మేధావి అని.. పేర్కొన్నారు. ఆయ‌న‌ను గెలిపించుకోవ‌డం.. ద్వారా.. ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాల‌ని.. బాల‌య్య పిలుపునిచ్చారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు.. ఏ ఎన్నిక‌లోనూ.. బాల‌య్య ఇలా పిలుపునివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తాజాగా సెల్పవీడియో విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిగా మారింది.