పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ.. మమతా బెనర్జీని ఓడించి.. అధికార పీఠంపై కమలాన్ని వికసింపజేసేందుకు బీజేపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలై.. 24 గంటలు కూడా తిరగకుండానే.. 144 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో తాజాగా బీజేపీ 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఒక వంతైతే.. మరోవైపు.. ముఖ్యమంత్రి, తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని వ్యక్తిగతంగా ఓడించడమే ధ్యేయంగా కూడా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2021లో ఓడించిన సువేందు అధికారినే ఇప్పుడు రెండు స్థానాలనుంచి బీజేపీ నిలబెట్టనుంది. గత 2021లో ఆయన మమతపై బీజేపీ తరఫున పోటీచేసి.. విజయం దక్కించుకున్నారు. దీంతో మమత పార్టీ అధికారంలోకి వచ్చినా..ఆమె మాత్రం పరాజయం పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యే కాకుండానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి భవానీపూర్ నుంచి 2021లోనే తమ పార్టీ తరఫున గెలిచిన సోమందేవ్ ఛటర్జీతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలో పోటీ చేసి మమత గెలిచారు. సో.. అలా.. అప్పట్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి మమతను ఓడించి రికార్డు సృష్టించారు. ఇక, ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా.. మమతను మరింత టెన్షన్లో ముంచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తిరిగి భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు. దీంతో సువేందు అధికారిని.. అటు నందిగ్రామ్, ఇటు భవానీపూర్ రెండు స్థానాల్లోనూ బీజేపీ నిలబెడుతోంది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది.
ఎవరీ సువేందు?
ఒకప్పుడు మమతకు రైట్ హ్యాండ్గా ఉన్న సువేందు అధికారి.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు. తర్వాత.. కాలంలో దీదీ పంచన చేరారు. ఆయనకు ఉన్న ప్రజాదరణకు తోడు మమత ఇచ్చిన అవకాశాలు వంటివి కూడా బలమైన నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. కాగా.. 2017లో ఆయన బీజేపీ వైపు మళ్లారు.
అప్పట్లో శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో సువేందు అధికారిపై కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల క్రమంలో ఆయన బీజేపీ వైపు మొగ్గుచూపారు. కాగా.. అప్పటి వరకు కుడిభుజంగా వ్యవహరించిన సువేందు పార్టీకి రిజైన్ కూడా చేయకుండా వెళ్లిపోయారంటూ.. బహిరంగ వేదికపై అప్పట్లో మమత చెమర్చారు. కాగా.. రేపు కనుక బీజేపీ అధికారంలోకి వస్తే.. సువేందుకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates