‘వైసీపీ విముక్త ఏపీ’నే మా నినాదం: ప‌వ‌న్

‘వైసీపీ విముక్త ఏపీ’నే ఇక నుంచి త‌న నినాద‌మ‌ని.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్తాన‌ని చెప్పారు. ఇది సాకారం అయ్యేవ‌ర‌కు.. తాను విశ్ర‌మించేది లేద‌న్నారు. విశాఖ నుంచి విజ‌య‌వాడ చేరుకున్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు.

“ఆంధ్రప్రదేశ్‌ నుంచే రాయలసీమకు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అంత మంది సీఎంలు వచ్చినా.. రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉంది. అధికారమంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి విముక్తి పొందాలి. అంతకంటే వేరే మార్గం లేదు. క్రిమినల్‌ పొలిటికల్‌ మైండ్‌సెట్‌ ఉన్న నేతలను పరిపాలన వ్యవస్థ నుంచి దూరం చేయాలి. అది జరిగేంతవరకు ఏపీ అభివృద్ధి చెందదు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

భవిష్యత్‌ తరానికి అది మంచిది కాదు. వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా జనసేన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. వైసీపీ క‌బంద హ‌స్తాల‌ నుంచి ఏపీని విముక్తి చేయడమే మా లక్ష్యమ‌ని అన్నారు. వైసీపీని గద్దె దించడం ఖాయమ‌ని, ఆ దిశగా జనసేన అడుగులు వేస్తుందని అన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసమే వచ్చే ఎన్నికల్లో పోరాడతామ‌ని.. అప్ప‌టి వ‌ర‌కు నిద్ర‌పోన‌ని పవన్‌ వెల్లడించారు.

‘విశాఖలో ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్ర చేశారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీసులు పని చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి చేసి విశాఖలో ఇబ్బంది పెట్టారు. వైసీపీ చేపట్టిన ‘విశాఖ గర్జన’ విఫలం కావడంతో మ‌మ‌ల్ని పోలీసులు అడ్డుకున్నారు. 105 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్య. ఒక పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం అప్రజాస్వామికం. కార్యకర్తలకు అభివాదం కూడా చేయొద్దని ఆంక్షలు విధించడం దారుణం. విశాఖ గర్జనకు లేని ఆంక్షలు జనవాణికే ఎందుకు వర్తిస్తాయి? రుషికొండ తవ్వకాలను పరిశీలించకుండా అనేక సార్లు అడ్డుకున్నారు అని వ్యాఖ్యానించారు.