ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. బ‌ట్ పేషంట్ డెడ్‌!!

ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. బ‌ట్ పేషంట్ డెడ్‌!! అన్న సూత్రం.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌కు అచ్చుగుద్ది నట్టు స‌రిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజు.. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది.

రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటి వరకు తెరవెనుక ఉండి పనిచేసిన పీకే.. ఇప్పుడు నేరుగా కదన రంగంలోకి దిగారు. స్వరాష్ట్రం బిహార్లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యమంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జన సురాజ్ పేరిట ఆ రాష్ట్రంలో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఆయన ఈ పాదయాత్ర ప్రారంభించారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇక్కడే.

పీకే పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్ర లో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్లనున్నారు. దాదాపు 3,500 కి.మీ ఆయన నడవనున్నారు. భారీ లక్ష్యాలు, అందుకు తగిన ఏర్పాట్లతో పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే నిరాశ ఎదురైంది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ నిర్వ‌హించాల‌ని.. నిర్ణ‌యించారు.

దీనికిగాను భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద పెద్ద టెంట్లు వేశారు. వ‌చ్చేవారుకూర్చునేందుకు వేల సంఖ్య‌లో కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కనిపించినవారిలో కొందరు.. పీకే కోసం రాలేదని, అక్కడి గాంధీ ఆశ్రమ సందర్శన కోసం వచ్చినవారని ప‌లువురు పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అస‌లు ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నాడా? అని మ‌రికొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.