పీకే మొదటి అడుగు వేశారా ?

రాజకీయ వ్యూహకర్తగా పాపులరైన ప్రశాంత్ కిషోర్ (పీకే) పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఈరోజు అంటే అదివారం నాడు బీహార్లో తన యాత్రను మొదలు పెట్టబోతున్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పశ్చిమ చంపారన్ జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. 1917లో గాంధి మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వాలోనే పీకే కూడా ఉద్యమం మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు.

3500 కిలోమీటర్ల పాదయాత్ర సుమారుగా 18 నెలలుగా జరగబోతోంది. చాలాకాలంగా వ్యూహకర్తగా తెరవెనుకకు మాత్రమే పరిమితమైన పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా ఉబలాటపడుతున్నారు. ఎన్నో పార్టీలను వ్యూహాలతో గెలిపించిన తానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు దిగకూడదని బహుశా పీకే ఆలోచించారేమో. తన వ్యూహాల ద్వారా ఎవరినో గెలిపించే బదులు అదేదో తానే పార్టీపెట్టి గెలిచేస్తే ముఖ్యమంత్రి అయిపోవచ్చని అనుకున్నట్లున్నారు.

అందుకనే ‘జన్ సురాజ్’ పేరుతో పాదయాత్రకు బీహార్ జనాలందరినీ ఉద్యమం వైపుగా కదిలించాలని డిసైడ్ అయిపోయారు. తొందరలో పీకే పెట్టబోయే పార్టీకి ఇది మొదటి అడుగుగా అనుమానంగా ఉంది. మరి ఒకవైపు పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళుతునే మరోవైపు వ్యూహకర్తగా కొన్ని పార్టీలకు ఎలా పనిచేయగలుగుతారనేది ప్రశ్న. ఇందులో భాగంగానే తన కంపెనీ ఐప్యాక్ నిర్వహణ మొత్తాన్ని ఇతరుల చేతికి అప్పగించారని అవసరమైనపుడు పై ఎత్తున పర్యవేక్షిస్తారంతే అని సమాచారం.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే అనేక పార్టీలతో సన్నిహితంగా తిరుగుతున్న కారణంగా పీకేకి కూడా బాగా రాజకీయ వాసనలు పట్టినట్లున్నాయి. అందుకనే రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీపెట్టి గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్నట్లున్నారు. ఏదైనా దిగితే కానీ లోతు తెలీదనే సామెత లాగ తయారవబోతోంది పీకే వ్యవహారం. రాజకీయ నేత వేరు వ్యూహకర్త వేరన్న విషయం తొందరలోనే పీకేకి అనుభవంలోకి రాబోతోంది. వ్యూహకర్తకు ప్రత్యక్షంగా జనాలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ రాజకీయ నేతలు 24 గంటలూ జనాల్లోనే ఉంటారు. మరి పీకే తాజా ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.