అడుగడుగునా పీకే టీం ?

వైసీపీ తరపున నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఐ ప్యాక్ బృందం డైరెక్టుగానే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పీకే బృందం ఇంతకాలం మంత్రులు, ఎంఎల్ఏలతో సంబంధం లేకుండా లోపాయికారీగా తమ పనిని చాపకింద నీరులాగ చేసుకుని వెళ్ళేది. తమ సర్వే నివేదికలను వారం వారం జగన్మోహన్ రెడ్డికి అందిస్తుండేది. కానీ అక్టోబర్ 1వ తేదీ నుండి సర్వే టీములోని సభ్యులు డైరెక్టుగా మంత్రులు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలతో భేటీలవబోతున్నారట.

మంత్రులు, ఎంఎల్ఏలతో ఈ బృందాలకు ఎలాంటి సంబంధాలు లేకపోయినా తమకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏలకు ఇస్తారట. అలాగే ఒక కాపీని ఐప్యాక్ హెడ్ ఆపీసుకు పంపి అక్కడనుండి జగన్ కు చేరవేస్తారట. అంటే ఒకే విధమైన రిపోర్టు ఎంఎల్ఏలతో పాటు జగన్ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి రిపోర్టును కింద స్ధాయిలో ఎవరూ ట్యాంపర్ చేసేందుకు అవకాశాలుండదు. పనిలో పనిగా పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు, రాజకీయాలకు సంబంధం లేని వార్గాలతో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండబోతున్నారు.

ఈనెల 15వ తేదీన ఒక్కో ఎంఎల్ఏకి ఒక్కో ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేయబోతున్నట్లు ఈమధ్యనే జరిగిన సమీక్షలో జగన్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో మంత్రులు, ఎంఎల్ఏలతో తిరిగే ఈ ప్రతినిధి తన రిపోర్టును నేరుగా ఐప్యాక్ కార్యాలయంకు అందిస్తారట.

15వ తేదీ నుండి ఎంఎల్ఏలతో తిరగబోయే ఐప్యాక్ ప్రతినిది రెండు వారాలకు ముందే తాను సొంతంగా నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. తన పర్యటనలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సమప్ చేసి మంత్రులు లేదా ఎంఎల్ఏలకు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. పార్టీ, ప్రభుత్వం లేదా వ్యక్తిగతంగా మంత్రి లేదా ఎంఎల్ఏపై జనాభిప్రాయం ఎలాగుందనే విషయాలపై రిపోర్టివ్వబోతున్నారు. ఒకవేళ ఎక్కడైనా మైనస్సులుంటే వాటిని ఎలా ప్లస్సులుగా మార్చుకోవాలి, ప్లస్సులుంటే దాన్ని ఎలా పెంచుకోవాలనే విషయాల్లో ఐప్యాక్ ప్రతినిధులు సహకరిస్తారు.