గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసుపై రోజు వారీ విచార‌ణ‌..మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి?

ఎక్కడో తీగ లాగితే.. ఇక్క‌డ ఏపీలో డొంక క‌దులుతోంది. గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు వ్యవహారంలో విచారణ రోజువారి జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. తనకు ఇచ్చిన బెయిల్‌ షరతులు సడలించి బళ్లారి వెళ్ళేందుకు అనుమతించాలని గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

అయితే.. ఇప్పుడు.. ఇలాంటి అనేక కేసులు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ ప‌రిస్థితి పై కూడా ఎవ‌రైనా..కోర్టుకు వెళ్తే.. పిటిషన్ వేస్తే.. ఆయ‌న ప‌రిస్థితి కూడా ఇలానే మారే ప‌రిస్థితి ఉంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే..వ‌చ్చే ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అస‌లు గాలి కేసు ఏంటి?

గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. వాస్త‌వానికి ఈ కేసులో మూడేళ్ల‌పాటు జైలు జీవితం గ‌డిపిన గాలి.. త‌ర్వాత‌.. అత్యంత క‌ష్టంమీద బెయిల్ పొందారు. అయితే.. ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ఇచ్చారు. బ‌ళ్లారికి వెళ్లడానికి వీల్లేద‌ని.. కోర్టు ఆదేశించింది.(ఇక్క‌డే అక్ర‌మ మైనింగ్ జ‌రిగింది) అయితే.. ఇది త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మ‌ని… ఆ ప్రదేశాన్ని వీడి ఇప్పటికే 15 ఏళ్లు దాటిందని.. బళ్లారిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని గాలి జనార్దన్‌రెడ్డి తరపు న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టులో విచారణ ఆలస్యం అవుతోందని గతేడాది ఆగస్టులో బెయిల్‌ ఇచ్చిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం విధించిన షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఎంఆర్‌ షా.. ష‌రతులు ఉల్లంఘించ‌డానికి.. కేసు విచార‌ణ ఆల‌స్యం కావ‌డానికి గాలి జనార్దన్‌రెడ్డి కారణం కాదా, ఆయన ప్రమేయం లేదా అని ప్రశ్నించారు.

గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ షరతులు సడలించవద్దని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే ఇచ్చిన బెయిల్‌ని ఆసరా చేసుకుని సాక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని.. సాక్ష్యాధారాలను తారుమారు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో ఏమాత్రం కనికరం చూపినా కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

ప్రత్యేక కోర్టులో, హైకోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా కేసు ఆలస్యానికి కారణం అయ్యారని పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన న్యాయాధికారులను ప్రభావితం చేయాలని చూశారని.. ఓ న్యాయాధికారి అనుమానాస్పదంగా మరణించారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్‌ ఇస్తే వీళ్లు ఎలా ఉంటారో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అని ధర్మాసనం ముందు మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు.

క‌ట్ చేస్తే..

ఇప్పుడు జ‌గ‌న్ కేసుల్లోనూ విచార‌ణ మంద‌గ‌మ‌నంతో సాగుతోంది. అదేస‌మ‌యంలో రోజు వారీ విచార‌ణ చేప‌ట్టాల‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి … గాలి కేసులో భాగంగా.. ఎవ‌రైనా.. జ‌గ‌న్ కేసును కూడా సుప్రీం వ‌ర‌కు తీసుకువెళ్తే.. ప‌రిస్థితి మారే అవ‌కాశంఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ విష‌యంపైనే వైసీపీ నాయ‌కులు ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారు.