ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో శృతి మించిన కరోనా

టెస్టులు చేస్తున్న రాష్ట్రంలోను కేసులు కంట్రోల్ కావడం లేదు. టెస్టులు చేయని రాష్ట్రంలోను కరోనా కంట్రోల్ కావడం లేదు. టెస్టులతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలు సమాంతరంగా కేసులు పెరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. టెస్టింగ్ ట్రేసింగ్ చేసినా ఏపీలో ఎందుకు అంత పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ముందు నుంచి అప్రమత్తంగా ఉందన్న తెలంగాణ రాజధాని హైదరాబాదును సగం మంది ఖాళీ చేసినా ఎందుకు విజృంభిస్తుందో తెలియడం లేదు. మొత్తానికి తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా గుప్పిట్లో విలవిల్లాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1322 కేసులు వెలుగు చూశాయి. వీటితో ఏపీ 20 వేల మార్కు దాటింది. తాజాగా డిశ్చార్జి అయిన కేసులు 424 గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8290 గా ఉంది. విచారకరం ఏమిటంటే రాష్ట్రంలో యాక్టివ్ కేసులు (10860) ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరణించిన ఏడుగురితో కలిపి ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 239కి చేరింది. ఇక మొత్తం ఏపీలో ఇప్పటివరకు 1033852 కోవిడ్ 19 టెస్టులు చేయగా, 16712 కరోనా పరీక్షలతో గత 24 గంటల్లో చేశారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 1831 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాదు నగరంలోనే 1419 కేసులు నమోదయ్యాయి. వీటితో తెలంగాణ కేసులు 25 వేల మార్కును దాటాయి. మొత్తం మరణాలు 306. ఇక పరీక్షల విషయానికొస్తే తెలంగాణ ఈరోజు చేసిన 6383 టెస్టులతో కలిపి మొత్తం 1,22,218 టెస్టులు ఇప్పటివరకు చేసింది. ఈ ఒక్క రోజే 19 మంది మరణించడం తెలంగాణలో పెరుగుతున్న మరణాలకు సూచిక. ఏపీతో పోలిస్తే తెలంగాణ యాక్టివ్ కేసులు తక్కువ. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 14781 కాగా, యాక్టివ్ కేసులు 10446గా ఉన్నాయి.