గోవధ నిషేధంపై తొలిబిల్లు కృష్ణంరాజు పెట్టారట

దివంగత సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్…కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, హీరో ప్రభాస్‌ ను రాజ్ నాథ్ పరామర్శించారు.

కృష్ణంరాజు మృతిపట్ల రాజ్ నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు అనారోగ్యం, అందించిన చికిత్సల గురించి రాజ్ నాథ్ కు కిషన్ రెడ్డి తదితరులు వివరించారు. ప్రభాస్ కూడా రాజ్ నాథ్ తో మాట్లాడారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభ కార్యక్రమానికి కూడా రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. కృష్ణంరాజు చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు.

కృష్ణంరాజు మంచి వ్యక్తి అని ఆయన తనుకు మంచి స్నేహితుడు అని రాజ్ నాథ్ ప్రశంసించారు. గోవధ నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు పెట్టింది కృష్ణంరాజు అని రాజ్ నాథ్ తెలిపారు. తెలుగు ప్రజలకు రెబల్ స్టార్ అయిన కృష్ణంరాజు, స్వగ్రామంలో అందరికీ సొంతమనిషి అని
తెలిపారు. కృష్ణంరాజు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఈ సంస్మరణ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఎవరికి కష్టం వచ్చినా కృష్ణంరాజు ఆదుకునేవారని, కేంద్రమంత్రిగా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని రఘురామ అన్నారు.