హైద‌రాబాద్‌పై ఓ క‌న్నేయండి కేసీఆర్ సార్‌

తెలుగువార‌నే కాకుండా దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు అత్య‌ధికంగా జీవిస్తున్న హైద‌రాబాద్ నగ‌రంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌నోళ్ల చూపు ప‌డుతోంది. అయితే, ఇది పెట్టుబ‌డుల కోణంలోనో లేక హైద‌రాబాద్ అంటేనే గుర్తుకువ‌చ్చే ఇంకేదైనా వివాదాస్ప‌ద‌ అంశంతో కాదు. క‌రోనాతో. ఈ మ‌హ‌మ్మారి విస్తృతి, ఇక్క‌డి కేసుల తీరుతో. న‌గ‌రంలోని ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోవ‌డం, ఊరు వ‌దిలిపోతున్న తీరుతో.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకి విస్త‌రించుకుంటు పోతున్న‌ది. గ్రేట‌ర్ లోని ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చాప‌కింద నీరుల పాకిపోతున్న‌ది‌. కొత్త కొత్త ప్రాంతాల‌లో తాజాగా క‌రోనా కేసులు భ‌య‌పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే లాక్ డౌన్ విధి‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కార్యాల‌యం నుంచే ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న రావ‌డంతో అంతా షాక్‌కు లోన‌య్యారు. లాక్ డౌన్ విధిస్తే, ఈ న‌గ‌రంలో ఉండ‌టం కంటే ఊరెళ్లి పోవ‌డం ఉత్త‌మ‌మ‌ని అనుకుంటున్నారు. త‌మ తమ స్వగ్రామాల‌ బాట ప‌డుతున్నారు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వంటి వారి నుంచి మొద‌లుకొని కూలీ ప‌ని చేసుకునే వారి దాకా అన్ని వ‌ర్గాల వారున్నారు.

ఇక తెలంగాణ‌లో జ‌రుగుతున్న క‌రోనా ప‌రీక్ష‌ల గురించి అంద‌రిలోనూ అనుమానాలే ఉన్నాయి. ఏకంగా హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఫైర‌యిందంటే… ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. కరోనా పరీక్షలు చేయకుండా.. జీవించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు? ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు? జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం ఎంత మందికి పరీక్షలు చేశారు? ఆ రోజు హైదరాబాద్‌లో టెస్ట్‌లు ఎందుకు నిలిపివేశారో వివరాలను సమర్పించాలని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.

మ‌రోవైపు ఏపీలో పెద్ద ఎత్తున క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. వైద్యం, చికిత్స విష‌యంలోనూ ఆ రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు స‌హ‌జంగానే కొంద‌రిలో ధైర్యం నింపుతున్నాయి. తెలంగాణ‌లో ప‌రీక్ష‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త లేని నేప‌థ్యంలో ఏపీకి వెళ్లి అవ‌స‌ర‌మైతే ప‌రీక్ష‌లు చేయించుకొని హోం క్వారంటైన్లో ఉండాల‌ని సైతం కొంద‌రు ఏపీ వాసులు భావిస్తున్నారు. దీనికి తార్కాణ‌మే ఏపీకి వెళ్లే స‌రిహ‌ద్దుల్లో గ‌త వారం రోజులుగా పెద్ద ఎత్తున పెరుగుతున్న వాహ‌నాల తాకిడి. మొత్తంగా, తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు, రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై అస్ప‌ష్ట‌త‌, క‌రోనా మ‌మ‌హ్మారి అన్నివ‌ర్గాల‌ను దెబ్బ‌తీసిన తీరుతో…బ్రాండ్ హైద‌రాబాద్‌ మ‌స‌క బారుతోందా? అనే సందేహం వ్య‌క్తమ‌వుతోంది. హైద‌రాబాద్‌లో ఏం జ‌రుగుతోందో కేసీఆర్ తెలుసుకోవాల‌ని ప‌లువురు అంటున్నారు.