ఈ ఎంపీ ఆలోచనేంటో అర్ధం కావటం లేదే ?

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు ఏమిటో అర్థం కావటం లేదు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికను అడ్డంపెట్టుకుని పార్టీలో ఎంపీ నానా రచ్చ చేస్తున్నారు. రోజుకోరకంగా మాట్లాడుతు అందరినీ అయోమయంలో పడేస్తున్నారు. ఇదంతా తమ్ముడు, బీజేపీ అభ్యర్ధిగా పోటీచేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గెలుపు కోసమే వెంకటరెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లుందని అందరు అనుమానిస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి అభ్యర్ధితో పాటు సీనియర్ నేతలు, ఉపఎన్నికల్లో మండలాలకు ఇన్చార్జిలుగా నియమితులైనవారంతా హాజరయ్యారు. కానీ ఎంపీ మాత్రం అడ్రస్ లేరు. ఉపఎన్నికలో పోటీచేయబోయే అభ్యర్ధి ఎవరనే చర్చ జరిగింది. అప్పట్లో చల్లమల్ల కృష్ణారెడ్డిని రేవంత్ ప్రతిపాదించారు. ఇదే సమయంలో స్రవంతే అభ్యర్ధిగా ఉండాలని ఎంపీ పట్టుబట్టారు.

అనేకమంది సీనియర్లతో మంతనాలు జరిపి, స్ధానికనేతల అభిప్రాయాలు సేకరించిన తరవాత చివరకు అధిష్టానం ఎంపీ ప్రతిపాదించిన స్రవంతినే అభ్యర్ధిగా ప్రకటించింది. తన ప్రతిపాదనకు అధిష్టానం అంత ప్రాధాన్యత ఇచ్చినపుడు మరిమొదటి సమావేశానికే ఎంపీ ఎందుకు డుమ్మాకొట్టారో ఎవరికీ అర్ధం కావటంలేదు. అభ్యర్ధి విషయంలో కానీ ఉపఎన్నికలో పార్టీ గెలుపు విషయంలో కానీ ఎంపీ మనసులో ఏముందో స్పష్టంగాతెలీక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పార్టీ ధర్మానికి కట్టుబడి తమ్ముడిని ఓడించటానికి స్రవంతి గెలుపుకు చిత్తశుద్దితో పనిచేస్తారని చాలామంది నమ్మటంలేదు. పైగా తమ్ముడి గెలుపుకు అందరు సహకరించాలని తమపై వెంకటరెడ్డి బాగా ఒత్తిడి తెస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతల్లో కొందరు బాహాటంగానే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో చాలామందిలో వెంకటరెడ్డి సిన్సియారిటిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన కదలికలను అందరు గమనిస్తుంటారని ఎంపీకి తెలియందికాదు. అయినా తనిష్టం వచ్చినట్లు నడుచుకుంటుండటమే ఆశ్చర్యంగా ఉంది.