సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి(సీఆర్డీఏ) కోసం.. ఏకంగా 1600 కోట్ల అప్పు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి కేబినెట్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో రాజ‌ధాని ప‌నులు చేస్తారా? లేదా? అనే విష‌యాన్ని మాత్రం స‌ర్కారు వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ చేయూత పథకానికి నిధుల ఆమోదానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న సీఎం జగన్‌ చేయూత నిధులను విడుదల చేస్తారు.. వారంపాటు మండల స్థాయిలో మహిళలతో చేయూత వేడుకలు నిర్వహించనున్నారు.

జల్‌జీవన్‌ మిషన్‌ అమలు కోసం 4 వేల 20 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల రాటిఫికేషన్‌ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలన్న నిర్ణయాన్ని.. మంత్రివర్గం ఆమోదించింది. గ్రేటర్‌ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.

యూనివర్సిటీలో అధ్యాపకుల కోసం నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్‌ కచ్చితంగా పాస్‌ కావాలన్న నిబంధనకు.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయంలో 80 మంది రెగ్యులర్, 48 మంది నాన్‌ టీచింగ్ సిబ్బందిని అవుట్ సోర్సింగ్‌పై నియామకానికి నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర సచివాలయంలో 85 మంది అదనపు సిబ్బంది పోస్టుల నియామకానికి ఆంగీకారం తెలిపింది. మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని.. మంత్రివర్గం ఆమోదించింది. సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం తీసుకునేందుకు.. బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలన్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సీఆర్డీఏ యాక్ట్‌లోని ‘ఒ’ క్లాజ్‌లో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.