చంద్రబాబు విజన్ అసాధారణం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. 1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. ఇక, చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే చంద్రబాబు విజన్ ను ఐఐఐటీహెచ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా డాట్‌ కామ్‌ సంస్థలు పుట్టుకొస్తున్న తరుణంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ సంస్థలను హైదరాబాద్ లో నెలకొల్పారని రాజిరెడ్డి ప్రశంసించారు. ఆ క్రమంలోనే బిల్‌గేట్స్‌ను హైదరాబాద్‌కు రప్పించారని గుర్తుచేసుకొన్నారు. అప్పట్లోనే చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ద్వారా ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్‌లను ఇచ్చేవారని రాజిరెడ్డి అన్నారు.

చంద్రబాబుకు టెక్నాలజీపై ఉన్న అవగాహన చూసి అమెరికా నుంచి వచ్చిన తాను ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగంలో నిపుణుల కొరతను చంద్రబాబు ముందే గుర్తించారని, అందుకే ఐటీ కోసం ప్రత్యేక వర్సిటీని రూపొందించాలని కోరారని ఆనాటి విషయాలను నెమరు వేసుకున్నారు. చంద్రబాబు ఆలోచనకు అప్పటి నాస్కామ్‌ మెహెతా సహకరించారని, అప్పట్లో ఐఐటీ అలహాబాద్‌, కాన్పూర్‌ ల ఉన్నాయని వెల్లడించారు..

పేటెంట్‌ రైట్స్‌ ఉల్లంఘించి ఐఐటీ హైదరాబాద్‌ అని పెట్టడం సాధ్యపడదని, ఆ పేరు మార్చాలని ఎంహెచ్‌ఆర్‌డీ ఒత్తిడి చేసిందని అన్నారు. కానీ, నాటి ప్రధాని వాజ్‌పేయ్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయనతో మాట్లాడిన చంద్రబాబు ఆ అభ్యంతరాలు సరికాదని చెప్పారు. కానీ, పేరు మార్చాల్సిందేనంటూ నాటి కేంద్ర మంత్రి మురళీ మనోహర్‌ జోషి పట్టుబట్టడంతో ఇంటర్నేషనల్‌ అన్న పదాన్ని చేర్చాల్సి వచ్చిందని అన్నారు. అయితే, ఇదే బ్రాండింగ్‌గా మారిందని చెప్పుకొచ్చారు. దానికి అటానమస్‌ హోదా వచ్చేలా చంద్రబాబు సహకరించారని రాజిరెడ్డి గుర్తు చేసుకొన్నారు.