అన్నా క్యాంటీనే ల‌క్ష్యం.. కుప్పంలో అదే ర‌చ్చ‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ అదే ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. అన్న క్యాంటీన్లపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. రాత్రికి రాత్రి దాడి చేసి.. ఎక్క‌డిక‌క్క‌డ‌.. వాటిని నాశ‌నం చేశార‌ని.. టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మేలో నిర్వ‌హించిన మ‌హానాడు సంద‌ర్భంగా.. కుప్పంలోని ఆర్టీసీ బ‌స్టాండు కూడ‌లిలో అన్న‌క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. వాస్త‌వానికి అప్ప‌ట్లోనే దీనికి అధికారులు అనుమ‌తులు ఇవ్వ‌లేదు.

అయితే.. ఎట్ట‌కేల‌కు స్థానికంగా.. టీడీపీ సానుభూతిప‌రుల‌కు ఉన్న స్థ‌లంలోనే దీనిని ఏర్పాటు చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే.. ఇక్క‌డ నిత్యం మూడు పూట‌లా ప్ర‌జ‌ల‌కు ఆహారం అందిస్తున్నా పూట‌కు 200 మందికి త‌గ్గ‌కుండా.. నిత్యం టిఫెన్‌, భోజ‌నం అందిస్తున్నారు. ఇలా కుప్పం ఆర్టీసి బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌కు ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్యంగా రోజు వారి కార్మికులు.. ఆటో, రిక్షా కార్మికులు కూడా.. ఇక్క‌డ ఆహారం తీసుకుంటున్నారు.

అయితే.. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు క‌నిపించ‌కూడ‌ద‌నే ఉద్దేశ‌మో.. లేక‌.. దీని వ‌ల్ల‌.. టీడీపీ పుంజుకుంటుంద‌నే.. రాజ‌కీయ ఆలోచ‌నో.. ఏదైనా కానీ.. అన్న‌క్యాంటీన్ల‌పై అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు.. దూకుడు చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా సోమ‌వారం అర్ధ‌రాత్రి.. కొంద‌రు.. కుప్పంలో నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన‌.. అన్న క్యాంటీన్ల‌ను ధ్వంసం చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ‌.. వాటిని కూల‌దోసి.. ఫొటోలు తీసి మ‌రీ.. సోష‌ల్ మీడియాలో పెట్టారు.

ప్ర‌స్తుతం ఆయా ఫొటోలు.. వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అన్న క్యాంటీన్ల‌పై దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని తెలిపారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లు రద్దు చేశారని వైసీపీపై విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు పేద వాడి నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసిపి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.