ఏపీలో ఓటు మంత్రాలు.. మూడే

ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న‌వారు.. వచ్చితీరాల‌ని చెబుతున్న పార్టీ అధినేతలు కూడా.. రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్న కీల‌కైన మూడు అంశాల‌ను ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న వినిపిస్తోంది. వాటిలో కీల‌క‌మైన‌.. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిర్మాణం.. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు నిధులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ.. కీల‌క అంశాలుగానే చ‌ర్చ సాగుతోంది. ఈ సెంటిమెంటును సాధించుకోవాల‌నే త‌ప‌న కూడా.. ప్ర‌జ‌ల్లో ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఈ మూడు అంశాల‌ను ప్ర‌ధానంగా వైసీపీ ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. జ‌నాలు కూడా న‌మ్మారు. ఓట్లు కుమ్మ‌రించారు. ఇంకేముంది.. మేం అధికారంలోకి వ‌స్తే.. కేంద్రం మెడ‌లు వంచైనా.. సాధిస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ మూడు అంశాల‌ను ప‌క్క‌కు పెట్టేసి.. కేంద్రాన్ని ప్లీజ్ అన‌డం త‌ప్ప‌.. ఇప్పుడు చేసేది ఏమీ లేద‌ని చెప్పారు. దీంతో వైసీపీపై ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో ఆయా అంశాల‌ను లేన‌వనెత్తే పార్టీల వైపు.. ప్ర‌జ‌లు చూస్తున్నారు.

కానీ, అధికారం కోసం చూస్తున్న టీడీపీ కానీ, జ‌న‌సేన కానీ.. ప్ర‌జ‌ల సెంటిమెంటును ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు.. వారు నిర్దేశించిన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్నారని.. మేధావులు అంటున్నారు.. ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు.. వారికి ఏం చేయాలి.. అనేది ఇప్పుడు ముఖ్యం. పార్టీల అజెండా క‌న్నా..ప్ర‌జ‌ల అజెండాతో ముందుకువ స్తే.. ఏపీలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. ఇదే వైసీపీ అప్ప‌ట్లో చేసింది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుంది. అయితే.. వాటిని నెర‌వేర్చ‌డంలోవిఫ‌ల‌మైంది.. అని కొంద‌రు మేధావులు బాహాటంగానే చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా.. అధికారంలోకి రావాల‌ని.. సీఎం కావాల‌ని కోరుకుంటున్న పార్టీలు.. నాయ‌కులు కూడా.. ప్ర‌జ‌ల మ‌న‌సులో మాట వింటే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. దీనిపై వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంకా ఎన్నిక‌లకు చాలానే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. ప్ర‌జ‌ల సెంటిమెంటు ఆయుధంగా చేసుకుంటే.. మంచి ఫ‌లితం వ‌స్తుంద‌నే దిశ‌గా అడుగులు వేయాల‌ని మేధావులు చెబుతున్నారు.