మూడు రాజ‌ధానుల‌కే ఏపీ మొగ్గు..

ఏపీలో వివాదానికి కార‌ణ‌మైన మూడు రాజ‌ధానుల విష‌యం.. మ‌రోసారి తెర‌పైకి రానుందా?  ప్ర‌భుత్వం త‌న ప‌ట్టును స‌మ‌ర్థించుకునేందుకు.. సాధించుకునేంద‌కే ప్రాధాన్ం ఇస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు పరిశీల‌కులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్‌.. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై పెద్ద దుమార‌మేరేగింది. రాజ‌ధాని రైతులు.. ఉద్య‌మించారు. పాద‌యాత్ర‌లు చేశారు. న్యాయ‌పోరాటానికి దిగారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర హైకోర్టు.. అమ‌రావ‌తికే మొగ్గు చూపింది.

రాజ‌ధాని అమ‌రాతినే అభివృద్ది చేయాల‌ని.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందం మేర‌కు.. వారికి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు అప్ప‌గించాలని, మౌలిక స‌దుపాయాలను క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే..  అది కూడా కేవ‌లం మూడు మాసాల్లోనే ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. కానీ.. ఇది జ‌రిగి 8నెల‌లు అయినా.. కూడా ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌రకు ఇక్క‌డ చేసింది ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో మ‌రోసారి.. రైతులు ఉద్య‌మించేందుకురెడీ అవుతున్నారు.

ఈ ద‌ఫా.. అమ‌రావ‌తి నుంచి అరస‌వ‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. సెప్టెంబరు 2 నుంచి ఈ పాద‌యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వారిని మ‌రింత రెచ్చ‌గొట్టేలా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న ప్ర‌భుత్వం.. ఇప్పుడు సుప్రీం కోర్టులో స‌వాల్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ శ్రీరాం స్వ‌యంగా ఓ మీడియాకు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. స‌ర్కారు మూడు రాజ‌ధానుల‌కే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు.. వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి..  ద‌స‌రా త‌ర్వాత లేదా.. అదే రోజు నుంచి సీఎం జ‌గ‌న్ విశాఖలోనే ఉంటార‌ని.. అక్క‌డ నుంచి పాల‌న సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇది అధికారికంగా కాకుండా.. అన‌ధికారికంగా అక్క‌డ నుంచి పాల‌న సాగిస్తార‌ని చెబుతున్నారు. దీనిని బ‌ట్టి.. స‌ర్కారు మూడు రాజ‌ధానుల‌కే మొగ్గు చూపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎలాంటి ప‌రిణామాల‌కుదారితీస్తుందో చూడాలి.