బాబు ప‌ర్య‌ట‌న‌.. భయంలో వైసీపీ?

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు అధికార పార్టీ వైసీపీ నేత‌లు అడుగ‌డుగునా అవ‌రోధాలు క‌ల్పిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు.. తన సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించాల‌ని.. షెడ్యూల్ ఖ‌రారు చేసుకుని.. వ‌చ్చిన చంద్ర‌బాబుకు తొలిరోజు బుధ‌వారం.. రాళ్ల దాడిఎదురైంది. వైసీపీ నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు.. టీడీపీ శ్రేణుల‌పై క‌ర్ర‌లు, రాళ్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక‌, రెండో రోజు కూడా చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో రెండో రోజైన గురువారం కుప్పం బంద్ కు వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో అధికార పార్టీ నేత‌ల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి..  వ్యాపారులు వారి దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు మూత పడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా.. కూడా వైసీపీ నాయ‌కులు వాటిని తోసుకుని మ‌రీ వ‌చ్చేస్తున్నారు.  

మరోవైపు బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటీపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

లోకేష్ ఫైర్‌..

కుప్పంలో తాజా ప‌రిణామాల‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ మండిప‌డ్డారు. జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదన్నారు.. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పై వైసిపి మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కుప్పంలో చంద్రబాబు  ప్రారంభించబోయే అన్న క్యాంటిన్ ను వైసిపి గూండాలు ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాటతీస్తాం.. అని లోకేష్ హెచ్చ‌రించారు.