వైసీపీలో గుబులు రేపుతున్న సుప్రీం వ్యాఖ్య‌లు

కొన్ని కొన్ని విష‌యాలు ఎక్క‌డో జ‌రుగుతుంటాయి. కానీ, వాటితాలూకు మూలాలు మాత్రం ఏపీలో క‌నిపిస్తు న్నాయి. దీంతో అధికార పార్టీ నేత‌ల‌కు ఒకింత గుబులు రేగుతోంది. త‌మ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా దేశ‌వ్యాప్తంగా.. రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇస్తున్న ఉచిత హామీలు.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత సంక్షేమం వంటి అంశాల‌పై దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం విచార‌ణ జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఈ విచార‌ణ‌సంద‌ర్భంగా ప్ర‌ధాన‌న్యాయ‌మూర్తి.. జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు. ఈ వ్యాఖ్య‌లు.. అచ్చు  ఏపీని ఉద్దేశించే ఉన్నాయ‌ని.. ఏపీ రాజ‌కీయ పార్టీల్లో నాయ‌కులు చ‌ర్చించుకుం టున్నారు. దీంతో చివ‌ర‌కు.. సుప్రీం కోర్టు ఈ విష‌యంలో ఇచ్చే తీర్పు.. త‌మ‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో.. అని నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఉచిత ప‌థ‌కాల‌పై సుప్రీం కోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పంచే ఉచితాలు నేరం కాబట్టి ఆ అంశంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌నేది.. కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు. అయితే.. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ అమలుచేసే ఉచిత పథకాల గురించే స‌మ‌స్య‌గా మారింద‌ని.. దీనినే ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నార‌ని అన్నారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతులను పక్కనపెట్టి కేవలం ఉచిత పథకాల కోసం డబ్బు ఖర్చుపెట్టడాన్ని కొందరు తప్పుపడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో పంచే ఉచితాల వరకే పరిమితమైతే అది ఒక అంశంగా చూడొచ్చ‌న్న సీజే… అలా కాకుండా ప్రభుత్వాలు సాధారణంగా అమలుచేసే పథకాల గురించి అయితే అది వేరే విషయం కిందికి వస్తుందన్నారు. “ఎన్నికల్లో నెగ్గితే ప్రజలందర్నీ హాంకాంగ్‌, సింగపూర్‌కు పంపుతానని ఒక రాష్ట్రంలో ఒక రాజకీయపార్టీ ఎన్నికల సమయంలో చెబుతుంది. అలాంటి వాగ్దానాలు చేయొద్దని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలుగుతుంది? ఆ పార్టీకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలిసేంతవరకూ మీరు ఆ డబ్బు ఎక్కడినుంచి తెస్తారని అడగలేం. మనమంతా ఎంతోకొంత వాస్తవిక దృక్పథంతో ఉండాలి. ఇది చాలా సంక్లిష్ట అంశం“ అన్నారు.

అయితే.. ప్ర‌భుత్వాలు ఉచితాలు అమ‌లు చేయ‌డంపై మాత్రం సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణించాల‌ని వ్యాఖ్యానించారు. దీంతో సుప్రీం ఇచ్చే తుది తీర్పు ఎలా ఉంటుంద‌నేది వైసీపీ నేత‌ల్లో ఒకింత గుబులు రేపుతోంది. గత ఎన్నిక‌ల్లో ఉచిత హామీల‌తోనే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనికి సంక్షేమం అని పేరు పెట్టుకున్నారు. అయితే.. ఈ ప‌థ‌కాల అమ‌లు కోసం మితిమీరిన అప్పులు చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీంతో రాష్ట్రం దివాలా తీసే ప‌రిస్తితి వ‌స్తోంద‌ని అంటున్నారు. అయినా.. కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ.. ఉచితాల బాట‌కే.. వైసీపీ మొగ్గు చూపుతుండ‌డంతో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై నాయ‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.