కుప్పంపై బాబు మ‌ళ్లీ పోస్టు మార్టం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కుప్పం. చిత్తూరు జిల్లాలో త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల వెంట ఉంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ క‌న్నేసింది. దీంతో రాజ‌కీయా్లో ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేమ‌న్న‌ట్టుగా.. ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి డోలాయ మానంలో ప‌డిపోయింది. కుప్పంను మినీ మునిసిపాలిటీ చేయ‌డం.. అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టించ‌డం.. ఇటీవ‌లే 66 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర్కారు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో .. కుప్పం వైసీపీలో జోష్ పెరిగింది.

ఇక‌.. దీనిని చూసిన టీడీపీలోని ఓ వ‌ర్గం నాయ‌కులు ఇటీవ‌ల పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉలిక్కి ప‌డిన తెలుగు త‌మ్ముళ్లు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల‌ని చంద్ర బాబుకు విన్న‌వించారు. దీంతో చంద్ర‌బాబు బుధ‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు.. కుప్పంలో ప‌ర్య‌టించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఏం చేస్తారు?  కుప్పంపై ఎలాంటి వ్యూహాన్నిప్ర‌క‌టిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

నిజం చెప్పాలంటే.. చంద్ర‌బాబు గ‌త 40 ఏళ్ల చ‌రిత్ర‌లో సంక్రాంతి.. ద‌స‌రా వంటి పండుగ‌ల సంద‌ర్భంలో నే కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. కానీ, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక మాత్రం.. ఆయ‌న ప‌దే ప‌దే కుప్పం బాట ప‌డుతున్నారు. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అంత‌టితో అయిపోగానే.. ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ వెళ్లిపోతున్నారు. కానీ, ఇప్పుడు ఇక్క‌డ అంత‌కుమించి ఆయ‌న ఏదైనా చేయాల‌ని త‌మ్ముళ్లు కోరుతున్నారు. కేవ‌లం పైపై మాట‌లు కాదు.. ఏదైనా ప్ర‌ణాళిక ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మున్సిప‌ల్ ఓట‌మి త‌ర్వాత బాబులో కూడా ఆందోళ‌న అయితే ఉంద‌నే అంటున్నారు.

ఒక‌వైపు.. వైసీపీ దూకుడు చూపిస్తుంటే.. టీడీపీ మాత్రం పైపైమాట‌ల‌తో ముందుకు సాగ‌డం స‌రికాద‌ని ఇక్క‌డి నాయ‌కుల వాద‌న‌. ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ క‌న్నేసి.. త‌న‌వైపు తిప్పుకుంటున్న ద‌రిమిలా.. చంద్ర‌బాబు దానికి విరుగుడు మంత్రం వేయాల‌నేది.. ఇక్క‌డి నాయ‌కుల ప్ర‌ధాన సూచ‌న‌. ఈ నేప‌థ్యంలో కుప్పంలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌ను చంద్ర‌బాబు ఎలా ముగిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. చూడాలి.. వైసీపీ నేత‌ల‌కు వార్నింగులు ఇస్తారో.. పార్టీనేత‌ల‌ను లైన్‌లో పెడ‌తారో.. అని అంటున్నారు ప‌రిశీల‌కులు.