అఖిలను పక్కన పెట్టినట్లేనా ?

నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆళ్ళగడ్డ విషయంలో తీసుకున్న వైఖరితో ఇపుడిదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గాల సమీక్షలో కొందరికి టికెట్లు ఖరారుచేస్తున్న చంద్రబాబు నాయుడు మరికొందరి విషయంలో వాయిదా వేస్తున్నారు. గురువారం రాయలసీమలోని ఆళ్లగడ్డ, పుంగనూరు, రాజంపేట, మైదుకూరు, నందికొట్కూరు నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మరికొన్ని నియోజకవర్గాల నేతలతో కూడా భేటీ అయ్యారు.

పై నియోజకవర్గాల్లోని కొందరు నేతలకు టికెట్లు దాదాపు క్లియర్ చేసినట్లే అనుకోవాలి. వచ్చే ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని, పోటీ ఇవ్వాలని, నేతలందరినీ కలుపుకుని వెళ్ళాలని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను జనాల్లోకి రెగ్యులర్ గా తీసుకెళ్ళాలంటు కొందరు నేతలకు పేరు పెట్టి మరీ చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో సదరు నేతలకే ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు గ్యారెంటీ అనే అనుకోవాలి. అయితే ఆళ్ళగడ్డ నియోజకవర్గం సమీక్షలో మాత్రం నేతలంతా కలిసికట్టుగా పని చేసుకోవాలని చెప్పారు.

ఏ ఒక్కరి విషయంలోను చంద్రబాబు పేరు చెప్పకుండా జనరల్ గా మాట్లాడారు. అలాగే సమీక్ష అయిపోయిన తర్వాత భూమా అఖిలప్రియకు గట్టిగా చీవాట్లు పెట్టినట్లు సమాచారం. భూమా అఖిలప్రియ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు, నమోదైన కేసులు, కోర్టుల చుట్టూ తిరగడాలను చూస్తున్న చంద్రబాబు ఆమెకు టికెట్ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదట. ఒక్క అఖిల మాత్రమే కాదు తమ్ముడు, భర్త కూడా అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. ఏదో ఒక కేసంటే వీళ్ళ తప్పు లేకుండానే కేసులు నమోదుచేశారని సమర్ధించుకోవచ్చు.

కానీ అఖిల విషయంలో అలా కాదు. ఆమె+తమ్ముడు+భర్తపైన నమోదైన కేసులన్నీ కిడ్నాపులు, హత్యకు కుట్ర, భూకబ్జాలు, ఫోర్జరీ సంతకాలు, దొంగ పత్రాల తయారీకి సంబంధించినవి. పైగా వీటిల్లో చాలావరకు తెలంగాణా పోలీసులు పెట్టిన కేసులే కాబట్టి వాటిని తప్పుడు కేసులనేందుకు కూడా లేవు. ఇదే సమయంలో అఖిల కుటుంబంపై నియోజకవర్గంలో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆళ్ళగడ్డ విషయాన్ని పెండింగులో పెట్టినట్లున్నారు. మరి అఖిల ఎలా రెస్పాండవుతుందో చూడాలి.