మోడీ కోట‌రీలో అనూహ్య మార్పు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కోట‌రీ-ఈ మాట వినేందుకు ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది ప‌చ్చినిజం. కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఒక్క ఒక్క అడుగు ముందుకు వేసి.. త‌న‌కు అనుకూలంగా ఉండేవారిని మంత్రి ప‌ద‌వుల్లో నియ‌మించుకున్నారు. త‌ర్వాత‌.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఏ ఒక్క‌రైనా త‌న‌కు వ్య‌తిరేకంగా స్వ‌రం విప్పుతార‌ని కానీ.. ఎవ‌రైనా.. త‌న‌కు ఎదురు తిరుగుతార‌ని.. కానీ భావిస్తే.. ముందుగానే వారిని ఏరివేసే క్ర‌తువును ప్రారంభించారు. ఇలా ఇప్ప‌టికే చాలా మందిని ఆయ‌న త‌ప్పించారు.

ఇప్పుడు ఈ జాబితాలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ స‌హా.. ప‌లువురు చేరిపోయారు. దీంతో వారిని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. గ‌డ్క‌రీ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌స్తుత రాజ‌కీయాలు చూస్తే.. విర‌క్తి పుడుతోంద‌ని అన్నారు. ఆయ‌న అన్న కాంటెస్ట్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో సైలెంట్గా ఉన్న మోడీ.. ఇప్పుడు ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. మోడీకి అనునిత్యం అండ‌గా ఉండే.. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి గ‌డ్క‌రీకి ఉద్వాస‌న ప‌లికారు.

అదేస‌మ‌యంలో మరికొంతమందిని తీసుకున్నారు. వీరిలో మోడీకి విధేయుడిగా పేర్కొన్న‌ కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్‌, భూపేంద్ర యాదవ్‌ సహా ఓం మాథూర్‌, సుధా యాదవ్ ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, షాహన్‌వాజ్‌ హుస్సేన్‌కు బోర్డు నుంచి ఉద్వాసన పలికారు. ఇక్బాల్ సింగ్‌ లాల్‌పుర, సత్యనారాయణ జతియా, కే లక్ష్మణ్‌ను బోర్డులోకి తీసుకున్నారు.

అదేవిధంగా బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీలో కూడా మార్పులు చేశారు. కొత్త వారితో కలిపిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పార్టీ విడుదల చేసింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సభ్యులుగా ఉన్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. పార్టీ పెట్టుకొన్న 75ఏళ్ల వయో పరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం. దీనిని బ‌ట్టి.. మోడీకి విధేయులుగా ఉంటే చాలు.. ఏదైనా సాధ్య‌మే అనే వ్యాఖ్య‌లు పార్టీలోనే వినిపిస్తున్నాయి.