నరేంద్ర మోడీ పై పెరిగిపోతున్న ఒత్తిడి

Modi
Modi

గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం చివరకు నరేంద్రమోడీ మెడకు చుట్టుకుంటోంది. ముఖ్యమైన దినోత్సవాల్లో జైలులో ఉన్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగున్న వారిలో కొందరిని విడుదల చేయటం సహజంగా జరిగేదే. ఈ పద్దతిలోనే ఆజాదీకీ అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీల్లో కొందరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. అయితే ఏ రాష్ట్రంలోను లేనివిధంగా గుజరాత్ రాష్ట్రంలో విడుదలైన కొందరు ఖైదీల విషయంలోనే గోల పెరిగిపోతోంది. పైగా ఆ గోలంతా మోడీ మెడకు చుట్టుకుంటోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ లోని గోద్రా సబ్ జైలు నుంచి 11 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరి నేపథ్యం ఏమిటంటే హత్యలు, మహిళాలపై వేధింపుల కారణంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారందరినీ గుజరాత్ ప్రభుత్వం ఏరికోరి విడుదల చేయించింది. దీంతో ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2002 గోద్రా అల్లర్ల నేపథ్యంలో బిల్కిస్ బానో అనే మహిళ ఇంటి మీద అల్లరిమూకలు దాడి చేశాయి. ఆ దాడుల నుండి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ఇరుగుపొరుగు వారితో కలిసి బానో కూడా తప్పించుకుంది.

ఇంటినుండి తప్పించుకునేటప్పటికి బానో ఐదు నెలల గర్భవతి. తనిద్దరు పిల్లలతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు, ఇతరులతో ఆమె ఊరికి ఆనుకునున్న పంటపొలాల్లోకి వెళ్ళి దాక్కుంది. అయితే అల్లరిమూకలు వీళ్ళని వెంటాడి పట్టుకున్నారు. అందరిముందే బానోను సామూహికంగా అత్యాచారం చేశారు. బానో కుటుంబసభ్యుల్లో ఏడుగురిని హత్యచేశారు. అలాగే మరికొందరిని కూడా చంపేశారు. అల్లర్ల వేడి తగ్గిన తర్వాత బానో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎవరు పట్టించుకోలేదు. గోద్రాలోని ఏ పోలీసుస్టేషన్లోను బానో ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేయలేదు.

తర్వాత కోర్టుకే నేరుగా ఫిర్యాదు చేయడం, సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసుకట్టారు. తర్వాత చాలాకాలం పాటు విచారణలు జరిగి చివరకు కొందరిని అరెస్టు చేశారు. వీరిలో 11 మందిని దోషులుగా తేల్చిన కోర్టు కొందరిపై సాక్ష్యాలు లేవని కేసు కొట్టేసింది. అలా జైలులో ఉంటున్న 11 మందిని ఇపుడు గుజరాత్ ప్రభుత్వం విడుదలచేసింది. స్పెషల్ రిలీజ్ పాలసీ కింద రేపిస్టులు, పథకం ప్రకారం దాడులుచేసి హత్యలుచేసే వాళ్ళని వదలకూడదని ఉంది. అయినా ఆ నిబంధనను ప్రభుత్వం పట్టించుకోకుండా రిలీజ్ చేయటంతోనే గొడవలు మొదలయ్యాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.